మళ్లీ ఎన్డీఏ గూటికి నితీష్.. త్వరలో రాజీనామా ?

by Dishanational4 |
మళ్లీ ఎన్డీఏ గూటికి నితీష్.. త్వరలో రాజీనామా ?
X

దిశ, నేషనల్ బ్యూరో : పొలిటికల్ సర్కస్ ఫీట్లకు మరోసారి బిహార్‌ వేదిక కాబోతోంది. ఇండియా కూటమికి షాకిచ్చే సంచలన ప్రకటన చేసేందుకు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రెడీ అవుతున్నారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కాంగ్రెస్‌తో పొత్తు ప్రసక్తే లేదని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(టీఎంసీ), పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ (ఆప్)‌ ప్రకటించిన వెంటనే నితీష్ కూడా వారి బాటలోనే పయనిస్తున్నారు. ఇండియా కూటమిలో ఏర్పడుతున్న బీటలకు ఈ పరిణామాలు సంకేతంగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం బిహార్‌లో ప్రభుత్వం నడుపుతున్న మహా ఘట్బంధన్ కూటమిలో కాంగ్రెస్, నితీష్ కుమార్‌కు చెందిన జేడీయూ, లాలూ ప్రసాద్‌కు చెందిన ఆర్జేడీ భాగస్వాములుగా ఉన్నాయి. తాజాగా తన పార్టీ (జేడీయూ) ఎమ్మెల్యేలందరినీ బిహార్ సీఎం నితీష్ కుమార్ పాట్నాకు పిలిచారు. ఎమ్మెల్యేలతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నితీష్ కుమార్ రాజీనామా నిర్ణయాన్ని ప్రకటిస్తారని అంటున్నారు. బీజేపీ, జితన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్తానీ అవామ్ మోర్చాలతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేస్తామనే విషయాన్ని గవర్నర్‌కు నితీష్ తెలియజేస్తారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసిన తర్వాత.. ప్రస్తుత అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు నితీశ్ వెళ్తారనే ప్రచారం జాతీయ మీడియాలో జరుగుతోంది.

ఐదోసారి నితీష్ జంప్..

ఒకవేళ ఇదే జరిగితే 2013 సంవత్సరం నుంచి ఇప్పటివరకు నితీష్ కుమార్ రాజకీయ కూటములు మారడం ఇది ఐదోసారి అవుతుంది. బిహార్ మాజీ సీఎం దివంగత కర్పూరీ ఠాకూర్‌‌కు కేంద్ర సర్కారు భారతరత్న ప్రకటించిన కొన్ని రోజుల్లోనే ఈవిధంగా రాష్ట్ర రాజకీయ సమీకరణాలు మారుతుండటం గమనార్హం. బీజేపీతో ఉన్న ముందస్తు అవగాహనతోనే నితీష్ ఇదంతా చేస్తున్నారనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈనేపథ్యంలో నితీష్ కుమార్‌ను శాంతింపజేసేందుకు కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలు చివరిసారిగా తమవంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆర్జేడీ నుంచి లాలూప్రసాద్ యాదవ్, కాంగ్రెస్ నుంచి ముఖ్యనేతలు నితీష్‌కు కాల్ చేసినట్లు సమాచారం. బిహార్‌లోకి ప్రవేశించనున్న భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొనాలని నితీష్‌ను కాంగ్రెస్ పెద్దలు కోరారని తెలుస్తోంది. ఆర్జేడీకి బిహార్ అసెంబ్లీలో అత్యధిక సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్నారు. ముందుజాగ్రత్త చర్యగా పాట్నాకు వచ్చేయాలని తమ ఎమ్మెల్యేలకు లాలూ ప్రసాద్ ఆదేశించారు.

Next Story