అలా మాట్లాడటం ప్రధాని మోడీ అజ్ఞానానికి నిదర్శనం: మంత్రి నిరంజన్ రెడ్డి

by Web Desk |
అలా మాట్లాడటం ప్రధాని మోడీ అజ్ఞానానికి నిదర్శనం: మంత్రి నిరంజన్ రెడ్డి
X

దిశ, వనపర్తి: ప్రధాని మంత్రి మోడీ అజ్ఞానం.. మూర్ఖత్వంతో మాట్లాడడం దేశానికి మంచిది కాదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హితవు పలికారు. బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు ఎకో పార్క్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. బైక్ ర్యాలీలో మంత్రి పాల్గొని నిరసన వ్యక్తం చేసారు. మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, కోళ్ల వెంకటేష్, టీఆర్ఎస్ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసారు. అనంతరం ప్రధాని దిష్టిబొమ్మను దగ్ధం చేసారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర విభజన అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ అజ్ఞానంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. అనేక చర్చలు, శ్రీకృష్ణ కమిటీ నివేదికల అనంతరం తెలంగాణ విభజన బిల్లును పార్లమెంట్‌లో పాస్ చేసిన విధానాన్ని ప్రధాని తప్పుబడుతూ మాట్లాడటం సరికాదని తెలిపారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడడం ప్రధాని అజ్ఞానానికి నిదర్శం అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్న తరుణంలో ప్రధాని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విడ్డురంగా ఉందన్నారు. భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఇసుమంతైనా పాత్ర లేని బీజేపీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం దక్షిణ ప్రాంతంపై వివక్ష చూపిస్తుందన్నారు. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే మోనార్క్ మోడీని ఒక్క కేసీఆర్ మాత్రమే ఎదురిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలను మరచిన వారు మట్టిలో కలిసిపోతున్నారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మారెడ్డి, రైతు సమితి జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు రమేష్ గౌడ్, కార్యదర్శి ఆవుల రమేష్, మైనారిటీ నాయకులు జహంగీర్, మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed