అటు ఎన్నికలు.. ఇటు కరోనా.. సంక్షేమానికి బ్రేక్

by  |
welfare schemes
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు బ్రేక్​ పడింది. ఇప్పటికే వేల కోట్ల పెండింగ్​ బిల్లులు ఉండగా… తాజాగా సంక్షేమ ఫైళ్లు కూడా వెయిటింగ్​ జాబితాలో చేరిపోయాయి. ఓ వైపు కరోనా సాకుతో ఉన్నతాధికారులకు కార్యాలయాలకు దూరమయ్యారు. మరోవైపు ఫైళ్లను క్లియర్​ చేయించాల్సిన అమాత్యులు ఎన్నికల్లో బిజీ అయ్యారు. దీంతో కళ్యాణలక్ష్మి, సీఎం రిలీఫ్​ ఫండ్​ వంటి దరఖాస్తులు కూడా ఆగిపోతున్నాయి. అంతేకాకుండా త్వరలోనే కొత్త రేషన్​ కార్డులు, కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామన్న ప్రభుత్వ హామీకి కూడా అడ్డు పడుతోంది. వీటిపై క్షేత్రస్థాయి పరిశీలన చేసేందుకు గతంలో నిర్ణయం తీసుకున్నా… ప్రస్తుతానికి బ్రేక్​ వేశారు. మొత్తంగా రాష్ట్రంలో సంక్షేమం ఆగిపోయింది.

అత్యవసరాలకు కూడా అడ్డే

సీఎం కేసీఆర్​, మంత్రి కేటీఆర్​ సహా ప్రముఖులకు కరోనా పాజిటివ్​ రావడంతో కొద్దిరోజులుగా ప్రధాన ఫైళ్లు కూడా ఆగిపోతున్నాయి. వీటి జాబితాలో అత్యవసర ఫైళ్లు కూడా చేరాయి. పేదల వైద్యం కోసం జారీ చేసే ముఖ్యమంత్రి రిలీఫ్​ ఫండ్​కు కూడా తాత్కాలికంగా బ్రేక్​ పడింది. అటు సీఎం లేకపోవడంతో, కార్యాలయాల్లో ఉన్నతాధికారులు ఉండకపోవడం, అమాత్యులు కూడా సమయమివ్వకపోవడంతో ఈ ఫైళ్లు క్లియర్​ కావడం లేదు. దాదాపు 18 రోజుల నుంచి సీఎంఆర్​ఎఫ్​ ఒక్క దరఖాస్తుకు కూడా మోక్షం లభించడం లేదు. ఎల్​ఓసీ రాకపోవడంతో పేద వర్గాలు అక్కడో, ఇక్కడో అప్పులు తీసుకువచ్చి వైద్యం చేయించుకుంటున్నాయి.

రాష్ట్రంలో చాలా పథకాలు ఆపేసిన ప్రభుత్వం… సంక్షేమ పథకాలకు మాత్రం నిధులు విడుదల చేస్తోంది. దీనిలో కళ్యాణలక్ష్మి, షాదీముబారక్​ ఉంటోంది. అయితే దాదాపు నెల రోజుల నుంచి కళ్యాణలక్ష్మి చెక్కులు జారీ చేయడం లేదు. గతంలో మంజూరైన చెక్కులను ఇటీవల పంపిస్తున్నారు. అయితే కొన్ని చెక్కులు సమయం దాటి వస్తున్నాయని, గడువుకు రెండు, మూడు రోజుల ముందే చేతికి అందుతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎలక్షన్స్‌లో మంత్రులు… ఇంట్లో పెద్దసార్లు

మరోవైపు మంత్రులు మున్సిపల్​ఎన్నికల్లో నిమగ్నమైతే.. ఉన్నతాధికారులు కరోనా భయంతో ఇండ్లకే పరిమితమవుతున్నారు. చాలా మంది ఐఏఎస్‌లు, హెచ్ఓడీలో ఇంటి నుంచే పనులు చేస్తుండటంతో కొన్ని ఫైళ్లు క్లియర్​కావడం లేదు. మంత్రులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులైతే మండలి ఎన్నికల నుంచి నియోజకవర్గాలకు దూరమయ్యారు. దీంతో కొన్ని ప్రధానమైన దరఖాస్తులు క్యాంపు కార్యాలయాల్లో పెండింగ్‌లో​ఉంటున్నాయి. ఒకవేళ మంత్రులకో, ఎమ్మెల్యేలకో చేరినా.. అధికారుల దగ్గరకు వెళ్లలేక వాయిదా వేస్తున్నారు. ఇటీవల వరుసగా సాగర్​ఉప ఎన్నిక, ఇప్పుడు మున్సిపల్​ ఎన్నికలు రావడంతో దాదాపుగా మంత్రులంతా ప్రచార బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. దీంతో సీఎంఆర్ఎఫ్, కళ్యాణలక్ష్మి వంటి కీలకమైన, అత్యవసరమైన ఫైళ్లు కూడా ఆగిపోతున్నాయి.
మరోవైపు ఉన్నతాధికారులు కూడా కార్యాలయాల్లో దొరకడం లేదు. సచివాలయంతో పాటుగా ప్రధాన కార్యాలయాల్లో సందర్శకులనే రానీయడం లేదు. కొన్ని ఫైళ్లు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకుని, ఉన్నతాధికారులను కలిసి విజ్ఞప్తి చేసుకుందామంటే ఆఫీసుల్లోకి రానీయడం లేదు.

ఆసరా, కొత్త రేషన్​ కార్డులు ఎప్పుడో..?

రాష్ట్రంలోని అర్హులైన వారందరికీ ఆసరా పెన్షన్లు, కొత్త తెల్ల రేషన్​కార్డులు జారీ చేస్తామని సీఎం కేసీఆర్​ ప్రకటించారు. హాలియా సభలో సాగర్​ ఎన్నికల ముందు ఈ ప్రకటన చేశారు. పలుమార్లు మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్​రావు కూడా చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటికే పెన్షన్ల కోసం దాదాపు 8.60 లక్షలు, కొత్త రేషన్​ కార్డుల కోసం మరో నాలుగు లక్షల దరఖాస్తులు ఉన్నాయి. వీటితో పాటుగా మరిన్ని దరఖాస్తులు వచ్చాయి. అయితే వీటిపై గ్రామ, వార్డు స్థాయిలో క్షేత్రస్థాయి పరిశీలన చేసి, వాటిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కానీ వాటి పరిశీలన ముందుకు పడటం లేదు. ఎందుకంటే వాటి పరిశీలన ఇప్పుడే వద్దంటూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది జూన్​ నుంచి కొత్త రేషన్​కార్డులు, ఆసరా పెన్షన్లు మంజూరు చేస్తారని భావించారు. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే… ఇప్పట్లో కష్టమే.

Next Story

Most Viewed