నేలకొండపల్లిలో వికసించిన అరుదైన పుష్పం..

by  |
నేలకొండపల్లిలో వికసించిన అరుదైన పుష్పం..
X

దిశ, పాలేరు : ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో అరుదైన పుష్పం విరబూసింది. ఏడాదికి ఒకసారి మాత్రమే విరబూసే బ్రహ్మకమలం పుష్పానికి నేలకొండపల్లిలో ప్రత్యేక పూజలు చేశారు. సాధారణంగా ఉత్తరాఖండ్‌లోని శీతల ప్రాంతాల్లో మాత్రమే కనిపించే అరుదైన బ్రహ్మ కమలాలు ఖమ్మం జిల్లాలో కనువిందు చేస్తున్నాయి. అరుదైన ఈ పుష్పాన్ని వీక్షించేందుకు మహిళలు భారీగా తరలివస్తున్నారు. పుష్పం ఏడాదికి ఒకసారి మాత్రమే పూస్తుంది. అందుకే దీనిని ఎంతో పవిత్రమైనదిగా చూస్తారు. తాజాగా ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం దగ్గులరామాంజి రెడ్డి(పాత ఇనుము రెడ్డి) ఇంటిలో బ్రహ్మకమలం వికసించింది. ఈ విషయం తెలిసిన మహిళలు భక్తి శ్రద్ధలతో ఆ పుష్పానికి ప్రత్యేక పూజలు చేశారు. అరుదైన, ప్రత్యేకత కలిగిన పుష్పం త‌మ‌ వీధిలో విక‌సించ‌డంతో స్థానికులు ఆనందం వ్యక్తంచేయడంతో పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు.

ఈ సందర్భంగా రామాంజి రెడ్డి సతీమణి అరుణ మాట్లాడుతూ.. తమ ఇంటిలో బ్రహ్మకమలం పూయడం చాలా ఆనందంగా ఉందన్నారు. సరిగ్గా మూడేళ్ల కిందట తమ ఇంటి పెరట్లో ఈ మొక్క నాటామన్నారు. తాజాగా రాత్రి ఎనిమిది గంటల సమయంలో బ్రహ్మకమలం విరబూసింద‌ని ఆమె చెప్పారు. ఈ బ్రహ్మకమలం ఎంతో ప్రత్యేకమైనది. బ్రహ్మ కమలం అంటే బ్రహ్మ కూర్చునే పువ్వు అని అర్థం. హైందవ సంప్రదాయంలో దీనికి చాలా విశిష్ఠత‌ ఉంది.ఈ పుష్పం జనారణ్యంలో కనిపించడం చాలా అరుదు. దీనిని పెంచేవాళ్లు కూడా చాలా తక్కువ. ఇది ఎక్కడపడితే అక్కడ కనిపించదు.

హిమాలయాల్లో దొరికే చాలా అరుదైన మొక్క. ఈ మొక్కను ఇంట్లో ఉంచితే మంచిదని హిందువులు భావిస్తారు. బ్రహ్మ కమలం అంటే శ్రీ మహావిష్ణువు నాభి నుండి ఉద్భవించినదిగా పురాణాల్లో ఉంది. దీని నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించాడని, బ్రహ్మ ఉద్భవించినందునే దీన్ని బ్రహ్మకమలం అని చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈ పుష్పాలతో దేవుడ్ని పూజిస్తే మనసులో ఎలాంటి కోరికలు ఉన్నా తీరుతాయన్నది చాలా మంది నమ్మకం.సుమారు 12 వేల అడుగుల ఎత్తులో వున్న హిమాలయాల్లో సంవత్సరానికి ఒకే ఒకసారి ఈ బ్రహ్మకమలం వికసిస్తుందని సమాచారం.


Next Story

Most Viewed