బీపీసీఎల్ వీఆర్ఎస్ పథకం

by  |
బీపీసీఎల్ వీఆర్ఎస్ పథకం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ మూడో అతిపెద్ద చమురు శుద్ధి, రెండో అతిపెద్ద ఇంధన రిటైల్ బీపీసీఎల్‌ను ప్రైవేటీకరించే ముందు కంపెనీ తమ ఉద్యోగుల కోసం స్వచ్ఛంద విరమణ పథకాన్ని(వీఆర్ఎస్) తీసుకొచ్చింది. వివిధ వ్యక్తిగత కారణాలతో సంస్థతో కొనసాగలేని స్థితిలో ఉన్న ఉద్యోగులను స్వచ్చంద విరమణ పథకాన్ని అందించాలని బీపీసీఎల్ నిర్ణయించింది. ఈ విషయాన్ని బీపీసీఎల్ తన ఉద్యోగులకు ఇచ్చిన నోటీసులో వెల్లడించింది.

భారత్ పెట్రోల్యం వాలంటరీ రిటైర్‌మెంట్ స్కీమ్-2020 గత వారం ప్రారంభమవగా ఆగష్టు 13న ముగియనుంది. ప్రైవేట్ మేనేజ్‌మెంట్ కింద పనిచేసేందుకు ఇష్టపడని ఉద్యోగి, అధికారి ఎగ్జిట్ ఆప్షన్ ద్వారా వీఆర్ఎస్ తీసుకొచ్చామని కంపెనీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కొంతమంది ఉద్యోగులకు బీపీసీఎల్ ప్రైవేటీకరణ తర్వాత వారి స్థానం, పోస్టింగ్ ప్రాంతం మారవచ్చని తెలుస్తోంది. ఈ కారణంగానే వీఆర్ఎస్ పథకాని తెచ్చినట్టు అధికారి వివరించారు.

కాగా, ప్రభుత్వం బీపీసీఎల్‌లో మొత్తం 52.98 శాతం వాటాను విక్రయించనుంది. ప్రస్తుతం సంస్థలో సుమారు 20 వేల మంది ఉద్యోగులున్నారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో 5 నుంచి 10 శాతం మంది ఉద్యోగులు వీఆర్ఎస్‌ను ఎంచుకునే అవకాశముందని కంపెనీ వర్గాలు భావిస్తున్నాయి. బీపీసీఎల్ ఇచ్చిన నోటీసు ప్రకారం 45 ఏళ్లు నిండిన ఉద్యోగులందరూ ఈ పథకానికి అర్హులని తెలుస్తోంది. అయితే, ఈ పథకం నుంచి క్రీడల ద్వారా నియమించబడిన ఉద్యోగులు, బోర్డు స్థాయి కార్యనిర్వాహకులను మినహాయించింది.



Next Story

Most Viewed