ఎలక్ట్రిక్ వాహనాల తయారీ విభాగంలోకి 'బౌన్స్'!

by  |
Bounce two-wheele
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ)కు డిమాండ్ పెరుగుతున్న సంగతి తెల్సిందే. ఇప్పటికే పలు కంపెనీలు తమ ఈవీ స్కూటర్లను తీసుకొచ్చాయి. తాజాగా ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ రెంటల్ స్టార్టప్ సంస్థ ‘బౌన్స్’ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీలోకి ప్రవేశించనుంది. రాబోయే 12 నెలల్లో ఈ-స్కూటర్ల తయారీ, బ్యాటరీ మౌలిక సదుపాయాల కోసం 100 మిలియన్ డాలర్లు(సుమారు రూ. 742 కోట్ల) పెట్టుబడులు పెడుతున్నట్టు బౌన్స్ సహ-వ్యవస్థాపకుడు, సీఈఓ వివేకానంద అన్నారు. కంపెనీ తన మొదటి ఈ-స్కూటర్‌ను ఈ నెలాఖరులో ఆవిష్కరిస్తుందని, 2022, ఫిబ్రవరి నాటికి డెలివరీలను ప్రారంభించనున్నట్టు ఆయన తెలిపారు.

‘ కంపెనీ రానున్న రోజుల్లో దేశీయ మార్కెట్లోని ఇతర సంస్థలతో పోటీ పడే స్థాయిలో ఈవీలను తయారు చేయనుంది. దీనికోసం మౌలిక సదుపాయాలతో పాటు బ్యాటరీ సంబంధిత సమస్యల పరిష్కారానికి సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రణాళిక సిద్ధంగా ఉంది. ఈ నెలలో రెండు వేరియంట్లలో వాహనాలను విడుదల చేస్తాం. నెలాఖరులోనే ప్రీ-బుకింగ్ కూడా మొదలవనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి చివరికి డెలివరీలు మొదలవుతాయని’ వివేకానంద వివరించారు. తమ అంచనా ప్రకారం.. ప్రీ-బుకింగ్ సమయంలో లక్షకు పైగా వాహనాలు బుకింగ్ అవుతాయనే అంచనాలున్నాయని కంపెనీ అభిప్రాయపడింది. రెండు వేరియంట్లలో రానున్న బౌన్స్ ఈ-స్కూటర్ ఒకటి బ్యాటరీతోనూ, మరొకటి బ్యాటరీ లేకుండా ఉంటుంది. బ్యాటరీ ఈ-స్కూటర్ రూ. 70 వేలలోనూ, బ్యాటరీ లేని ఈ-స్కూటర్ రూ. 50 వేల లోపు ఉండే అవకాశం ఉందని కంపెనీ పేర్కొంది.


Next Story