కొవిషీల్డ్‌తో 26 మందిలో బ్లీడింగ్, క్లాటింగ్

by  |
కొవిషీల్డ్‌తో 26 మందిలో బ్లీడింగ్, క్లాటింగ్
X

న్యూఢిల్లీ: ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రా జెనెకా అభివృద్ధి చేసిన టీకా(మనదేశంలో కొవిషీల్డ్) తీసుకున్న వారిలో రక్తస్రావం లేదా రక్తంగడ్డకట్టిన కేసులున్నట్టు కేంద్ర ప్రభుత్వం ధ్రువీకరించింది. మనదేశంలో కొవిషీల్డ్ తీసుకున్న 26 మందిలో ఈ సైడ్ ఎఫెక్ట్ కనిపించినట్టు తెలిపింది. సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మనదేశంలో ఈ టీకాను ఉత్పత్తి చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, భారత్ బయోటెక్ ఉత్పత్తి చేస్తున్న కొవాగ్జిన్ టీకా తీసుకున్నవారిలో ఈ కేసులు కనిపించలేదని పేర్కొంది. యూరోప్ దేశాలలో ఆస్ట్రా జెనెకా టీకా తీసుకున్నవారిలో రక్తంగడ్డకడుతున్నట్టు వచ్చిన వార్తలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. అప్పుడే కేంద్ర ప్రభుత్వం మనదేశం లోనూ ఈ టీకాపై లోతైన అధ్యయనం చేయడానికి అడ్వర్స్ ఈవెంట్ ఫాలోయింగ్ ఇమ్యునైజేషన్(ఏఈఎఫ్ఐ) కమిటీని వేసింది.

ఈ కమిటీ అధ్యయనంలో కొవిషీల్డ్ తీసుకున్న 26 కేసుల్లో బ్లీడింగ్ లేదా క్లాటింగ్ కనిపించినట్టు వెల్లడించింది. ఈ నివేదికను కేంద్ర ఆరోగ్య శాఖకు సమర్పించింది. ఈ రిపోర్ట్ ప్రకారం, కొవిన్ యాప్‌లో 23వేల తీవ్ర దుష్ప్రభావాలు కనిపించాయి. అందులోనూ 700 కేసులు సీరియస్ అని తేలింది. 498 సీరియస్ కేసులను కూలంకషంగా పరిశీలించగా 26 కేసుల్లో బ్లడ్ క్లాటింగ్ సమస్యలు ఎదురైనట్టు బయటపడింది. యూకే, జర్మనీలతో పోలిస్తే మనదేశంలో రిపోర్ట్ అయిన కేసులు అత్యల్పమని రిపోర్ట్ తెలిపింది. యూకేలో ప్రతి పదిలక్షల డోసులకు 4 కేసుల్లో ఈ సమస్య ఎదురవ్వగా, జర్మనీలో ప్రతి పది లక్షల డోసులకు 10 మందిలో కనిపించింది. కానీ, మనదేశంలో ప్రతి పదిలక్షల డోసుల్లో కేవలం 0.61 కేసుల్లో రిపోర్ట్ అయినట్టు నివేదిక వివరించింది.



Next Story

Most Viewed