రేట్లు పెరగనున్నాయి!

by  |
రేట్లు పెరగనున్నాయి!
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా ఇంట్లోకి చొరబడనుంది. అయితే, వైరస్ రూపంలో కాదు.. ధరల రూపంలో ! విడి భాగాలను అత్యధికంగా ఉత్పత్తి చేసే చైనాను కరోనా వైరస్ ఉక్కిరిబిక్కిరి చేస్తుండటంతో మనదేశంలో ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు పెరగనున్నాయి. దీంతో గృహావసర వస్తువులపై అధికభారం పడనుండటం గమనార్హం.

ఎలక్ట్రానిక్స్‌ రంగంలో ప్రధానంగా అమ్ముడుపోయే రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, మైక్రోవోవెన్, వాషింగ్ మెషిన్ వంటి పరికరాల ధరలు పెరగనున్నాయి. కరోనా వైరస్ విస్తరిస్తుండటం.. సరఫరాలో తలెత్తిన అంతరాయం వల్ల వీటి ధరలను పెంచుతున్నట్టు, పెరిగే ధరలు మార్చి నుంచి అమల్లోకి వచ్చే అవకాశముందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఎల్‌జీ, వోల్టాస్, శామ్‌సంగ్, హయర్, పానసోనిక్ సహా ప్రధాన ఎలక్ట్రానిక్ కంపెనీలన్నీ అన్ని రకాల మోడళ్లపై 3 నుంచి 5 శాతం వరకు ధరలను పెంచాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. వీటిలో ప్రీమియం, అధిక కెపాసిటీ ఉన్న మోడళ్లపై రూ.3,000 నుంచి రూ. 4,000 వరకు ఈ పెరుగుదల ఉండనున్నట్టు సమాచారం.

చైనాలో ఉత్పత్తి నిలిచిపోవడం, ప్రస్తుతమున్న ఉత్పత్తి రవాణాకు ఎక్కువ వ్యయం అవుతుండటంతో విడి భాగాల ధరలు పెరిగాయని ఇండియాలో అతిపెద్ద ఏసీ తయారీ సంస్థ వోల్టాస్ ఎండీ ప్రదీప్ బక్షి తెలిపారు. ‘ఇటీవల కేంద్రం విడుదల చేసిన బడ్జెట్‌లో కొన్ని విడిభాగాలపై 2.5 శాతం సుంకాన్ని పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకుని మేం కొన్ని రకాల వస్తువులపై ధరలను పెంచుతున్నాం’ అని ఆయన వివరించారు. మార్చి నెల నుంచి ఏసీ ధరలు 3 శాతం పెరుగుతాయని, మే నెలలో ఈ అంశాలపై మరోసారి సమీక్షిస్తామని ప్రదీప్ బక్షి చెప్పారు.

మార్చి నుంచి మొదటగా మైక్రో వోవెన్లు, వాషింగ్ మెషిన్ల ధరలు 3 నుంచి 4 శాతం పెరుగుతాయని ఎల్‌జీ, శామ్‌సంగ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ విభాగం వారు తెలిపారు. తర్వాత రిఫ్రిజిరేటర్లు, ఏసీల ధరలు పెంచనున్నట్టు కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. మరో సంస్థ పానసోనిక్ సైతం ఏసీ, రిఫ్రిజిరేటర్ ధరలను పెంచే యోచనలో ఉంది. అయితే, ఇతర ఉత్పత్తులపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఏసీ, రిఫ్రిజిరేటర్ల ధరలను 2.5 నుంచి 5 శాతం వరకూ పెంచాలని హయర్ కంపెనీ భావిస్తోంది. చైనాలో ఉన్న వీరి కర్మాగారాలు సగం వరకు ఉత్పత్తిని నిలిపివేసినట్టు హయర్ ఇండియా ప్రతినిధి వెల్లడించారు. టెలివిజన్ విభాగంలో ప్రధానమైన ఎల్ఈడీ టీవీల ధరలను 7 శాతం నుంచి 10 శాతం వరకు పెంచాలని నిర్ణయించాయి. ఇదివరకు టీవీల విభాగంలో 15 శాతం నుంచి 20 శాతం కంపెనీలు ధరలను పెంచాయి.

ఏసీ, రిఫ్రిజిరేటర్లు, కంప్రెషర్లు, వాషింగ్ మెషిన్ మోటార్లు, ప్లాస్టిక్ విడి భాగాలను చైనా అత్యధికంగా సరఫరా చేస్తోందని, నోట్ల రద్దు తర్వాత 2019లో రిఫ్రిజిరేటర్, ఏసీ, వాషింగ్ మెషిన్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయని సేల్స్ ట్రాకర్ అనే సంస్థ ఇచ్చిన నివేదికలో పేర్కొంది.



Next Story

Most Viewed