ఈఎన్‌టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న బ్లాక్‌ఫంగస్ రోగులు

by  |
ఈఎన్‌టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న బ్లాక్‌ఫంగస్ రోగులు
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్ : కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రికి బ్లాక్‌ఫంగస్ రోగుల రద్ధీ కొనసాగుతోంది. పోస్ట్ కొవిడ్ పేషంట్లు అధికంగా ఈ వ్యాధి బారిన పడుతుండగా ప్రతినిత్యం వందల సంఖ్యలో రోగులు హాస్పిటల్ కు క్యూ కడుతున్నారు . ఈఎన్‌టీ ఆస్పత్రిని బ్లాక్ ఫంగస్ నోడల్ హాస్పిటల్ గా ప్రభుత్వం ప్రకటించిన నాటి నుండి ప్రతినిత్యం వందల సంఖ్యలో ఓపీ విభాగానికి బ్లాక్ ఫంగస్ వ్యాధి లక్షణాలతో రోగులు వస్తున్నారు. దీంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ వ్యాధిగ్రస్థుల కోసం 1500 పడకలు అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. గాంధీ, కింగ్ కోఠి జిల్లా ఆస్పత్రి, సరోజినీ దేవీ కంటి ఆస్పత్రి తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చెవి, ముక్కు, గొంతు సేవలు అందిస్తున్న హాస్పిటల్స్ లో 350 పడకలు ఏర్పాటు చేసి ఎక్కడిక్కడే వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంది. ఈ హాస్పిటల్ లో మెరుగైన వసతులు, అందుబాటులో మందులు, వైద్యులు, సిబ్బంది ఉండడంతో బ్లాక్ ఫంగస్ రోగులు వైద్య సేవలు పొందేందుకు ముందుకు వస్తున్నారు.

పెరుగుతున్న వెయిటింగ్ లిస్ట్…

బ్లాక్ ఫంగస్ వ్యాధి బారిన పడిన రోగులు కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రికి ప్రతినిత్యం వందల సంఖ్యలో వస్తున్నారు. దీంతో వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న వారిని ఇన్ పేషంట్లుగా చేర్చుకుని వైద్యం అందిస్తున్నారు. మిగిలిన వారి నుండి ఫోన్ నెంబర్లు తీసుకుని సమాచారం అందిస్తామని చెప్పి పంపిస్తున్నారు. అయితే రాష్ట్రంలోని దూర ప్రాంతాల నుండి వచ్చిన వారు మాత్రం తిరిగి వెళ్లకుండా ఆస్పత్రి ఆవరణలో, సమీపంలోని లాడ్జీలలో ఉంటూ తమ వంతు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రిలో పడకలు పూర్తి స్థాయిలో నిండిపోగా సుమారు 30 మంది వరకు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు.

ఒక్క రోజులో 18 సర్జరీలు…

కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రి ఓపీ విభాగానికి గురువారం 74 మంది రోగులు రాగా వీరిలో 32 మందిని ఇన్ పేషంట్లుగా చేర్చుకున్నారు. దీంతో ఇప్పటి వరకు హాస్పిటల్ లో ఇన్ పేషంట్ల సంఖ్య 275 కు చేరింది. మొత్తం 18 సర్జరీలు చేయగా 19 మందిని డిశ్చార్జ్ చేశారు . ఆస్పత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ వివరించారు.

Next Story

Most Viewed