కోఠి ఈఎన్‌‌టీలో బ్లాక్‌ఫంగస్ రోగి మృతి… అందుకే అంటున్న డాక్టర్లు…

by  |
Koti ENT
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్ : బ్లాక్ ఫంగస్ కారణంగా కోఠి ఈఎన్‌టీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఓ రోగి మృతి చెందాడు. దీంతో హాస్పిటల్ ను బ్లాక్ ఫంగస్ నోడల్ ఆస్పత్రిగా ఏర్పాటు చేసిన తర్వాత మొదటి మరణం చోటు చేసుకున్నట్లైంది. అదిలాబాద్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ (50) బ్లాక్ ఫంగస్ బారినపడి గత నెల 30వ తేదీన ఈఎన్‌టీ ఆసుపత్రిలో చేరాడు. వైద్యులు ఆయనకు మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తున్నప్పటికీ మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో పరిస్థితి విషమించి మృతిచెందాడు. దీంతో ఆస్పత్రి అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని అప్పగించారు. బ్లాక్ ఫంగస్ కారణంగా కోఠి ఈఎన్‌టీ హాస్పిటల్‌లో తొలి మరణం చోటు చేసుకోవడంతో హాస్పిటల్‌లో చికిత్సలు పొందుతున్న ఇతర రోగులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

బ్లాక్ ఫంగస్ కాదు – గుండె పోటు

కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రిలో మృతి చెందిన రోగి శ్రీనివాస్ బ్లాక్ ఫంగస్ కారణంగా చనిపోలేదని, అతనికి గుండె పోటు రావడంతోనే మృతి చెందినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ తెలిపారు. హాస్పిటల్‌లో చేరిన రోగులందరికీ మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని, ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితులను గమనిస్తూ చికిత్సలు అందిస్తున్నట్లు తెలిపారు. రోగులు, వారి సహాయకులు ఎటువంటి ఆందోళనలకు గురి కావద్దని ఆయన సూచించారు .

Next Story

Most Viewed