బీజేపీకి షాక్ ఇచ్చిన దీదీ.. టీఎంసీలోకి కీలక నేత…

by  |
mamatha banerjee
X

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ రాజకీయాల్లో పక్షం రోజులుగా సాగుతున్న చర్చకు ఫుల్‌స్టాప్ పడింది. బీజేపీ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్ టీఎంసీలో చేరారు. తన కొడుకు సుభ్రాంశు రాయ్ సహా ముకుల్ రాయ్ కోల్‌కతాలోని టీఎంసీ భవన్‌లో సీఎం మమతా బెనర్జీ సమక్షంలో పార్టీలో చేరారు. ముకుల్ రాయ్‌ను పార్టీలోకి స్వాగతిస్తున్నట్టు దీదీ అన్నారు. పార్టీలో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగిస్తామని వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేసినా ఎక్కడా టీఎంసీపై నోరుపారేసుకోలేదని, ఆయన నమ్మకద్రోహుడు కాదని తెలిపారు. టీఎంసీ కండువా కప్పుకున్న తర్వాత ముకుల్ రాయ్ మాట్లాడుతూ, ప్రస్తుత రాష్ట్ర పరిస్థితుల్లో బీజేపీలో ఎవ్వరూ నిలదొక్కుకోలేరని స్పష్టం చేశారు. ముకుల్ రాయ్ టీఎంసీ వ్యవస్థాపక సభ్యుడు. దీదీకి అత్యంత సన్నిహిత అనుచరుడు.

పార్టీని బలోపేతం చేయడం విశేష కృషి చేశారు. పార్టీలో అసెంబ్లీ ఎన్నిలకు ముందే దాదాపు నాలుగేళ్ల క్రితం బీజేపీలో చేరారు. అప్పటి నుంచీ బీజేపీ పటుత్వాన్ని పెంచడానికి పనిచేశారు. ఎన్నికలకు ముందు టీఎంసీ నుంచి పలువురు నేతలను బీజేపీలో చేర్చడంలో కీలకంగా వ్యవహరించారు. కానీ, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అంచనాలకు బహుదూరంగా నిలిచిన తర్వాత ముకుల్ రాయ్ వ్యూహాత్మకంగా నడుచుకున్నారు. పార్టీ కార్యకలాపాల్లో అంటీముట్టనట్టుగా ఉన్నారు. గతనెల 28న నిర్వహించిన బీజేపీ సమీక్షా సమావేశానికి డుమ్మా కొట్టారు. దీంతో ఆయన టీఎంసీలో చేరనున్నట్టు ప్రచారం ఉధృతమైంది. ఈ నేపథ్యంలోనే ముకుల్ రాయ్ శుక్రవారం కోల్‌కతాలోని తృణమూల్ భవన్‌కు విచ్చేసి పార్టీ చీఫ్ మమతా బెనర్జీతో సమావేశమయ్యారు. అనంతరం పార్టీలో చేరినట్టు ప్రకటించారు. బీజేపీలోని మాజీ టీఎంసీ నేతలపై దీని ప్రభావం బలంగా ఉండనున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే పలువురు నేతలు బీజేపీలో చేరే తమ నిర్ణయంపై పశ్చాత్తాపపడటం గమనార్హం.


Next Story

Most Viewed