పోలీసులకు బీజేపీ ధన్యవాదాలు

by  |
పోలీసులకు బీజేపీ ధన్యవాదాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలపై విశ్లేషణలు మొదలయ్యాయి. ఇప్పటి వరకు బీజేపీ దూసుకుపోతోంది. హరీష్‌రావు దత్తత గ్రామంతో పాటు గులాబీకి పట్టున్న గ్రామాల్లో బీజేపీ పాగా వేసింది. ఈ నేపథ్యంలో దుబ్బాక ప్రచారంలో పోలీసుల వ్యవహారంపై అన్ని వర్గాల వారు విభిన్న శైలిలో విశ్లేషిస్తున్నారు. పోలీసులతో టీఆర్ఎస్ పార్టీ వేయించిన ఎత్తులు బీజేపీకి కలిసి వచ్చాయని భావిస్తున్నారు. పోలీసుల ఓవరాక్షన్ ప్రభుత్వ అధికార దుర్వినియోగంగా దుబ్బాక ఓటర్లు భావించారని చెబుతున్నారు.

ప్రధానంగా పోలీసులు బీజేపీపై దాడి చేసినట్టుగానే ప్రచారమైంది. ఈ అంశాలు కూడా బీజేపీకి కలిసి వచ్చాయి. టీఆర్ఎస్ అనుకూలంగా మారుతుందన్న పోలీసుల వ్యవహారం ప్రధానంగా యువతలో మార్పుకు నాంది పలికినట్లైంది. దీంతో పోలీసులకు బీజేపీ తరుపున యువత సోషల్ మీడియాలో ధన్యవాదాలు చెబుతోంది. ఓటర్లు బీజేపీ వైపు మళ్లడానికి పోలీసులు కూడా కారణమంటూ ట్రోల్ చేస్తున్నారు.

ప్రభుత్వ యంత్రాంగం అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రతిపక్ష పార్టీలను ఉద్దేశపూర్వకంగానే వేధిస్తోందని బీజేపీ గట్టిగానే ప్రచారం చేసింది. దానికి తగ్గట్టుగానే లక్ష్యం ప్రకారం ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను ఇరుకున పెట్టడానికి అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ప్రచారం జరుగుతోంది. శామీర్‌పేటలో రూ. 40 లక్షల నగదు పట్టుబడింది మొదలు వాహనాలను ఎక్కడికక్కడ ఆపి సోదాలు చేయడం, గంటల తరబడి తనిఖీల పేరుతో సమయాన్ని వృధా చేయడం, బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేయడం, సిద్దిపేటలో సోదాలు చేయడం, రఘునందనరావు బంధువలపై దాడి చేయడం వంటి పరిస్థితులను బీజేపీ తనకు అనుకూలంగా ప్రచారం చేసుకుంది.

ఈ నేపథ్యంలో పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారని, బీజేపీని ఓడించడానికి అనేక రకాల కుట్రలు జరుగుతున్నాయని ప్రజల్లో సానుభూతి వచ్చేలా ప్రచారం జరిగింది. బీజేపీవైపు సానుభూతి పెరిగిందని భావించిన టీఆర్ఎస్ పరిస్థితిని అనుకూలంగా మల్చుకోడానికి ప్రయత్నాలు చేసిందని, ప్రజల్లో బీజేపీ పట్ల ఉన్న సానుభూతిని నీరుగార్చడం కోసం దూకుడు పెంచనట్లు దుబ్బాకలో విస్తృతంగా ప్రచారం జరిగింది. పోలీసులు విడుదల చేసిన వీడియో ఫుటేజీలు కూడా కమలం గుర్తుకే కలిసి వచ్చాయి. ఇది కలిసి వస్తుందని భావించిన టీఆర్ఎస్ బోల్తా పడింది.

సిద్దిపేట సీపీ… హరీష్‌రావు మసి
సిద్దిపేట పోలీస్ కమిషనర్ అధికార నిబంధనలను వదిలి బీజేపీ శ్రేణులపై దాడులకు దిగారు. స్వయంగా పోలీసులే నోట్ల కట్టలు బీజేపీ అభ్యర్థి ఇంట్లో పెట్టేందుకు ప్రయత్నాలు చేసిన వైనం రాష్ట్రమంతా చర్చగా మారింది. సిద్దిపేట సీపీ గులాబీ మంత్రి వలే బీజేపీని ఇరుకున పెట్టేందుకు రంగంలోకి దిగారు. మంత్రి హరీష్ రావు కూడా పోలీస్ కమిషనర్‌పై ప్లాన్‌పై ముందుగా సంతోషపడ్డారు. కానీ ఓట్ల పోలింగ్‌కు వచ్చే సరికి ఆశించిన ఫలితాలు తారుమారయ్యాయి. దీంతో సిద్దిపేట సీపీ ఓవరాక్షన్‌తో మంత్రి హరీష్‌రావు మసి అయ్యారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.


Next Story

Most Viewed