పట్టేద్దాం… పార్టీ మారే వాళ్లను

by  |
పట్టేద్దాం… పార్టీ మారే వాళ్లను
X

దిశ, వెబ్‌డెస్క్: దుబ్బాక ఉపఎన్నికలో సంచలన విజయం సాధించి రెట్టింపు ఉత్సాహంతో ఉన్న బీజేపీ.. అసలు గేమ్‌ స్టార్ట్ చేసింది. వలసలను ప్రోత్సహించి మహాసముద్రంలా మారిన టీఆర్ఎస్‌లో ఇమడలేక పోతున్నవారిపై ఫోకస్ చేసింది. కారులో సీటులేక అసంతృప్తితో రగిలిపోతున్న వారిని పక్కా వ్యూహాంతో లాగేసుకునేందుకు రెడీ అయింది. దుబ్బాక బూస్ట్‌ను వంట పట్టించుకొని ఇక ఆకాశమే హద్దుగా కేసీఆర్‌ పార్టీలోని నేతలను తెచ్చుకునేలా పావులు కదుపుతోంది.

రెండు మూడు నెలల్లోనే జీహెచ్ఎంసీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండడంతో పార్టీ పటిష్ఠతపై మరింత దృష్టి సారించింది. సొంత క్యాడర్‌తో పాటు ఆర్థికంగా నిలదొక్కుకొని కారులో ఊపిరాడకుండా ఎటూ తేల్చుకోలేక పోతున్నవారిపై కాన్సంట్రేట్ చేస్తోంది. పార్టీలో చేరితే సీటుపై నమ్మకం కుదిరిలా రాష్ట్రంలోని కీలక నేతలు, జాతీయ నేతలతో సైతం మాట్లాడిస్తున్నట్లు సమాచారం. గ్రేటర్‌లోనే కాక.. నియోజకవర్గాల్లోనూ టీఆర్ఎస్‌లో ఉండలేక పోతున్నవారి పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ స్వయంగా రంగంలోకి దిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక టీఆర్ఎస్‌కు బీజేపీనే ప్రత్నామ్నాయం అని చెబుతూ దుబ్బాక రిజల్ట్, పలు రాష్ట్రాల్లో మోదీ వేవ్‌ను చూపిస్తూ పార్టీలో చేరేలా గ్రీన్‌ సిగ్నల్స్ ఇస్తున్నారని చర్చ నడుస్తోంది.

ప్రస్తుతం అధికార పార్టీలో మంత్రులు, ఎమ్మెల్యేలతో పొసగక.. జరుగుతున్న అన్యాయాన్ని హైకమాండ్‌కు చెప్పలేక సతమతమవుతున్న వారిని ఆహ్వానించి టికెట్ ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం. ఇల్లు ఉన్నప్పుడే దీపం చక్కబెట్టుకోవాలనే చందంగా ఊపు ఉన్నప్పుడే నేతలను పార్టీలోకి తీసుకువస్తే జీహెచ్ఎంసీతో పాటు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇవ్వొచ్చని భావిస్తోన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో టికెట్ల విషయంలో టీఆర్ఎస్‌లో లొల్లి నడుస్తున్నందన మంచి పట్టున్న నేతలను చేర్చుకుంటే 2023ఎన్నికల వరకు టీఆర్ఎస్‌కు ధీటుగా ఎదిగి.. టఫ్ ఫైట్ ఇవ్వొచ్చని లెక్కలు వేసుకుంటున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

40ఏళ్ల కింద పార్టీ స్థాపించినప్పుడు కేవలం రెండు ఎంపీ సీట్లు మాత్రమే గెలిచిన బీజేపీ ఇప్పుడు దేశంలో కాషాయ జెండాను రెపరెపలాడిస్తోంది. తెలంగాణలో రెండు అసెంబ్లీ సీట్లు సాధించిన కమలం పార్టీ.. 2023 ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకుంటుందని నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా జీహెచ్ఎంసీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్లాన్‌ ప్రకారం ముందుకు వెళ్లి సత్తా చాటితే రాష్ట్రంలో బీజేపీకి ఇక తిరుగు ఉండదని కాషాయ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు.


Next Story

Most Viewed