దాగుడు మూతలు.. కారులోనే గాలిపటం జర్నీ : బీజేపీ

by  |
దాగుడు మూతలు.. కారులోనే గాలిపటం జర్నీ : బీజేపీ
X

టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీల మధ్య దోస్తానాపై బీజేపీ నేతలు భగ్గుమన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనే తాము ఈ రెండు పార్టీల మధ్య లోపాయకారి ఒప్పందాన్ని బహిర్గతం చేశామని, కానీ ఎలాంటి పొత్తూ లేదంటూ ఆ రెండు పార్టీలు తమంతట తాముగా సర్టిఫికెట్లు ఇచ్చుకున్నాయని, కానీ ఇప్పుడు మేయర్ ఎన్నిక సందర్భంగా వాటి బండారం బట్టబయలైందని బీజేపీ నేతలు ఆరోపించారు. ఆ రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందం ఉందని ఒకరంటే, టీఆర్ఎస్ తన గొయ్యిని తానే తీసుకుందని మరొకరు వ్యాఖ్యానించారు. మేయర్ ఎన్నిక సందర్భంగా ఈ రెండు పార్టీల నైజాన్ని బైటపెట్టాలని కాచుకుని కూర్చుకున్న బీజేపీకి తగిన ప్రచారాస్త్రం దొరికింది.

దిశ, తెలంగాణ బ్యూరో : జీహెచ్ఎంసీ‌ మేయర్‌గా టీఆర్ఎస్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి గెలిచినా చివరకు స్టీరింగ్ మాత్రం మజ్లిస్ పార్టీ చేతిలోనే ఉంటుందని, ఇది ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్, ఎంఐఎం మధ్య ఉన్న అక్రమ సంబంధం మరోసారి బహిర్గతమైందని పత్రికలకు విడుదల చేసిన ఒక ప్రకటనలో సంచలన వ్యాఖ్యలు చేశారు. “టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు చీకట్లో ప్రేమించుకుంటున్నాయి. అక్రమ సంబంధం పెట్టుకున్నాయి. బయటకు మాత్రం వేర్వేరు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి” అని బండి సంజయ్ ఆరోపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలూ కలిసి పోటీ చేసి ఉంటే టీఆర్‌ఎస్‌కు సింగిల్ డిజిట్ కూడా వచ్చేది కాదన్నారు. పక్కా మతతత్వ పార్టీ అయిన మజ్లిస్ పార్టీకి టీఆర్ఎస్ చెంచా అని ఇప్పుడు రుజువైందన్నారు. సిగ్గులేకనే ఎన్నికల్లో వేర్వేరు అని చెప్పుకుని ప్రచారం చేసుకున్నాయని విమర్శించారు. ఈ రెండు పార్టీలు కలిసి భాగ్యనగరాన్ని దోచుకునే కుట్ర చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కార్పొరేటర్లు హైదరాబాద్‌ను కంటికి రెప్పలా కాపాడుకుంటారన్నారు. పైసా అవినీతికి పాల్పడినా, అంగుళం జాగాను ఆక్రమించినా ఈ రెండు పార్టీలను బజారుకు లాగుతామని హెచ్చరించారు.

టీఆర్ఎస్ తన గోతిని తానే తీసుకుంది : రాజాసింగ్

జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీల మధ్య జరిగిన తతంగాన్ని ప్రజలు చూశారని, టీఆర్ఎస్ తన గోతిని తానే తవ్వుకుందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు. ఇద్దరు దొంగలు కలిసి మేయర్‌ను గెల్చుకున్నారని, గతంలో ఇద్దరూ కలిసి జీహెచ్ఎంసీని నాశనం చేసినట్లుగానే ఇప్పుడు కూడా ప్లాన్ ప్రకారం సహకరించుకున్నారని ఆరోపించారు. ఆ రెండు పార్టీలూ తోడు దొంగలన్నారు. టీఆర్ఎస్, మజ్లిస్‌ల మధ్య రహస్య ఒప్పందం మేయర్ ఎన్నిక సందర్భంగా బట్టబయలైందని వ్యాఖ్యానించారు. ఆనాడు తాము చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు మేయర్ ఎన్నికలో నిజమయ్యాయన్నారు. జీహెచ్ఎంసీ మేయర్‌గా పోటీచేసిన టీఆర్ఎస్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మికి మజ్లిస్ కార్పొరేటర్లు, ఎక్స్‌అఫీషియో సభ్యులు మద్దతు తెలిపారన్నారు.

ఫాంహౌజ్‌లో పడుకుంటే ప్రజా సమస్యలెలా తెలుస్తాయి : డీకే అరుణ

నాగార్జున సాగర్ ఉపఎన్నిక షెడ్యూల్ రాకముందే ఎన్నికల సభ నిర్వహించిన కేసీఆర్‌లో భయం కనిపిస్తోందని, దుబ్బాకలో బీజేపీ గెలుపుతో నిద్రపట్టడం లేదని బీజేపీ జాతీయ మహిళా నేత డీకే అరుణ వ్యాఖ్యానించారు. దుబ్బాక ఫలితంతో జీహెచ్ఎంసీ ఎన్నికలను ముందుకు జరిపారని, అయినా ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. ఓటమి భయంతోనే టీఆర్‌ఎస్-మజ్లిస్ పొత్తు లేదంటూ డ్రామాలాడారని, కానీ మేయర్ ఎన్నిక సందర్భంగా బట్టబయలైందన్నారు. హాలియా సభలో కేసీఆర్ కురిపించిన హామీల వర్షం చూస్తుంటేనే ఆయనలో ఓటమి భయం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందన్నారు. ఎన్నికలప్పుడు హామీలు ఇవ్వడం, ఆ తర్వాత మర్చిపోవడం ఆయనకు అలవాటేనని, ‘కుర్చీ వేసుకొని కూర్చుంటా.. కృష్ణా, గోదావరి నీళ్లతో కాళ్లు కడుగుతా..’ లాంటి పదాలు కేసీఆర్‌కు ఊత పదాలుగా మారాయన్నారు. హుజూర్‌నగర్ ఉపఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలు సంగతేంటని ప్రశ్నించారు. ఫాంహౌజ్‌లో పడుకునే కేసీఆర్‌కు ప్రజల సమస్యలు ఎలా తెలుస్తాయన్నారు. ఎన్నికల సభలో ఓట్లు వేసే మహిళలను ‘కుక్కలు’ అని సంభోదించిన టీఆర్ఎస్‌కు సాగర్ ఓటర్లు తగిన బుద్ధి చెప్తారన్నారు. గెలుపు కోసమే భారీ హామీలు కురిపించారని, జీవోలు ఎన్ని వచ్చినా పైసలు మాత్రం రావన్నారు. పీఆర్సీ పేరుతో ఉద్యోగులను కేసీఆర్ మభ్య పెడుతున్నారని, డ్రామాలతో కాలక్షేపం చేస్తున్నారన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలను ‘తోలు తీస్తా.. తాట తీస్తా..’ అంటూ అహంకార పూరితంగా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన డీకే అరుణ ఆ ఎమ్మెల్యేలకు ఆత్మగౌరవం ఉందా? అని ప్రశ్నించారు. బానిసల్లాగా ఆ పార్టీలో ఉండలేని ఆత్మాభిమానం ఉన్న ఎమ్మెల్యేలు బైటకు రావాలని కోరారు.

ఆ రెండు పార్టీలు ‘సియామీ’ కవలలు : విజయశాంతి

టీఆర్ఎస్, మజ్లిస్‌లు విడదీయలేని ‘సియామీ’ కవలలని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. గతేడాది డిసెంబరులో తాను చేసిన వ్యాఖ్యలకు తగిన విధంగానే మేయర్ ఎన్నిక సందర్భంగా రుజువైందని ‘ఫేస్‌బుక్’ వేదికగా ఆమె ఫైర్ అయ్యారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వంద డివిజన్లలో గెలుస్తామని బీరాలు పలికిన టీఆర్ఎస్ చివరకు మూడో వంతు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని డిసెంబరు 4వ తేదీన చేసిన వ్యాఖ్యలను తాజాగా ఫేస్‌బుక్‌లో జతచేశారు. విపక్షాలకు ఎన్నికల ప్రచారానికి తగిన సమయం ఇవ్వకుండా ఎన్నో కుట్రలు చేసిందని టీఆర్ఎస్‌పై నిప్పులు చెరిగారు. తక్కువ సీట్లు వచ్చినా మేయర్ పదవికి ఢోకా లేదని, ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లు పుష్కలంగా ఉన్నాయని టీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేశారని, కానీ చివరకు మేయర్ ఎన్నిక సందర్భంగా మజ్లిస్ మద్దతు అనివార్యమైందన్నారు. తాము తల్చుకుంటే రెండు నెలల్లో సర్కారును కూల్చేస్తామని మజ్లిస్, ఎఐఎం నుంచి ఎలాంటి మద్దతు లేదని టీఆర్ఎస్ ఎంతగా చెప్పుకున్నా చివరకు వాటి అసలు రంగు బైటపడిందని, డిసెంబరులో తాను వ్యక్తం చేసిన అనుమానమే ఇప్పుడు నిజమైందన్నారు.

Next Story

Most Viewed