తెలంగాణ‌ను లూటీ చేస్తున్నరు : తరుణ్ చుగ్

by  |
తెలంగాణ‌ను లూటీ చేస్తున్నరు : తరుణ్ చుగ్
X

దిశ ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్ : తెలంగాణ ప్ర‌జ‌ల ధ‌నాన్ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ దోచుకుంటున్నార‌ని బీజేపీ రాష్ట్ర‌ వ్య‌వ‌హారాల ఇన్చార్జి త‌రుణ్‌చుగ్ ఆరోపించారు. తెలంగాణ ఒక్క కేసీఆర్ పోరాటంతోనే రాలేద‌ని, అనేక మందిరి త్యాగాల పలితంగా రాష్ట్రం ఆవిర్భవించిందని అన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్ వీరోచితంగా ఉద్య‌మించింది నిజ‌మే అయితే వారి కుటుంబం నుంచి ఎవ‌రూ బ‌లిదానాల‌కు ఎందుకు పాల్ప‌డ‌లేదో చెప్పాలన్నారు. బంగారు తెలంగాణగా మారుస్తామన్న సీఎం లూట్ తెలంగాణ‌లో బిజిగా ఉన్నారని విమర్శించారు. వరంగల్ పర్యటన సందర్భంగా శ‌నివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పేదల అభివృద్ధికి పాటుప‌డుతోంద‌ని అన్నారు. జన్ ధన్ ఖాతాలలో రూ.40 వేల కోట్లు జమ చేశామ‌ని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రం అంద‌జేస్తున్న నిధుల‌ను ప‌క్క‌దారి ప‌ట్టిస్తున్నార‌న్నారు. సచివాలయానికి కూడా రాని ముఖ్య‌మంత్రి ఇక్కడే ఉన్నార‌ని అన్నారు. కేసీఆర్ కుటుంబ స‌భ్యులు ఇష్టారీతిన దోచుకుంటున్నార‌ని, దేశంలో ఎక్కడా లేని అవినీతి తెలంగాణలో ఉంద‌ని అన్నారు.

మామునూరు పాపం వారిదే..

మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కేంద్ర ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ‌య్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ‌మే ఇప్ప‌టి వ‌ర‌కు భూమి చూప‌లేదని అన్నారు. కాళేశ్వ‌రం ప‌నుల‌ను బీజేపీ అడ్డుకుంటోంద‌న్న విమ‌ర్శ‌లను కొట్టి పడేరేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉంద‌ని, అవినీతి, అక్ర‌మాలు బ‌య‌ట‌ప‌డుతాయ‌నే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం డీపీఆర్‌లు అందించ‌డం లేదని విమర్శించారు. 40 వేల‌ కోట్ల ప్రాజెక్టు అంచనాలను రూ. ల‌క్ష కోట్ల‌కు పెంచి దోపిడీకి పాల్ప‌డ్డార‌ని అన్నారు. సొంత పార్టీ నేత‌ల‌ను, మంత్రుల‌ను, ఎమ్మెల్యేల‌ను కాపాడుకునేందుకే బీజేపీ తమకు ద‌గ్గ‌ర అంటూ కేసీఆర్ ప్ర‌చారం చేసుకుంటున్నార‌ని ఎద్దేవా చేశారు. గుడుల‌ వ‌ద్ద కాదు.. అఫిషియ‌ల్‌గా కూర్చుందామ‌ని వ‌రంగ‌ల్ టీఆర్ ఎస్ ప్ర‌జాప్ర‌తినిధులు విసిరిన స‌వాల్‌ను ప్ర‌స్తావించ‌గా, గుడుల వ‌ద్ద‌కు ఎందుకు రారు? గుడుల వ‌ద్ద‌కు వ‌స్తే త‌ప్ప‌క స‌త్యాలే చెబుతార‌నే ఆలోచ‌న‌తోనే అక్క‌డ‌కి పిలుస్తున్నామని అన్నారు. క‌లెక్ట‌రేటో మ‌రేదో చోట‌యితే అన్నీ అబ‌ద్ధాలే చెబుతారంటూ వ్యాఖ్య‌నించారు. వారి వెంట బీజేపీ మాజీ ఎంపీ, వ‌రంగ‌ల్ కార్పొరేష‌న్ బీజేపీ ఎన్నిక‌ల ఇన్చార్జి జితేంద‌ర్‌రెడ్డి, రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి గుజ్జుల ప్రేమేంద‌ర్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్ర‌తినిధి రాకేష్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్య‌క్షురాలు రావు ప‌ద్మ తదితరులు ఉన్నారు.



Next Story

Most Viewed