టార్గెట్ చేసుకొని దాడులకు పాల్పడుతున్నారు : బండి సంజయ్

by  |
టార్గెట్ చేసుకొని దాడులకు పాల్పడుతున్నారు : బండి సంజయ్
X

దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ ప్రభుత్వం, పోలీస్ ఉన్నతాధికారుల తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. సోమవారం నిర్మల్ జిల్లా భైంసాలో బాధితులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 10వ తేదీన రాత్రి 11గంటలకు ఓ వర్గానికి చెందిన కొంతమంది వ్యక్తులు హిందువుల ఇళ్లను టార్గెట్ చేసి దాడులకు పాల్పడ్డారని, ఆస్తులను ధ్వంసం చేశారని, అయినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. కరోనా కట్టడికి లాక్‌డౌన్ విధించి ప్రార్థనాలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలకు అనుమతి నిరాకరించారని, అయినా ఒక వర్గం వారు వాటిల్లో ప్రార్థనలు జరిపారని పేర్కొన్నారు. భైంసా ఘటనతో ఎలాంటి సంబంధం లేని 17 ఏళ్ల బాలుడు సంతోష్‌ను పోలీసులు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారని, తల్లి ఎంత వేడుకున్నా వినలేదని చెప్పారు.

రాష్ట్రంలో ప్రస్తుతం కొంతమంది పోలీస్ అధికారుల తీరుతో తెలంగాణ అమరవీరుల ఆత్మఘోషిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. భైంసాలో ఎంఐంఎం దాడులకు పాల్పడుతున్నా టీఆర్ఎస్ ప్రభుత్వం వత్తాసు పలుకుతోందని ఆరోపించారు. భైంసాలో ఏం జరిగినా ఓ వర్గం మీడియా ప్రజలకు చూపెట్టడం లేదని, ఇంత జరుగుతున్నా జనాలకు తెలియకుంటే సమాజం ఆ మీడియాను నమ్మదని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా మీడియా పోషిస్తున్న పాత్ర అమోఘమని, కానీ తెలంగాణలో మాత్రం వేరే విధంగా ఉందన్నారు. ఇదంతా కోపంతో మాట్లాడుతున్నది కాదని, ఆవేదనతో చెప్పుకొస్తున్న వాస్తవాలని, దయచేసి భైంసాలో ఏం జరుగుతుందో మీడియా ద్వారా ప్రజలకు వివరించాలని రిక్వెస్ట్ చేశారు.

భైంసాలో పథకం ప్రకారం దాడులు జరుగుతున్నాయని దీనిపై ప్రభుత్వం, డీజీపీ స్పందించాలని సంజయ్ కోరారు. గొడవకు కారణమైన వారిపై కేసులు పెట్టకుండా 17 ఏళ్ల బాలుడిని తీసుకెళ్లి పోలీసులు కొట్టడం ఏంటని ప్రశ్నించారు. ఘటన జరిగిన సమయంలో ఆ బాలుడు తన అమ్మమ్మ ఇంటి వద్ద ఉన్నాడని ఆయన పేర్కొన్నారు. భైంసాలో సంఘ విద్రోహ శక్తులను ప్రేరేపించేలా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ ప్రెస్‌మీట్‌లోనే బాధిత బాలుడు సంతోష్ మాట్లాడుతూ ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆ సమయంలో తన అమ్మమ్మ ఇంటి వద్ద ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. ఎంత చెప్పినా వినకుండా స్టేషన్‌కు తీసుకెళ్లి పోలీసులు కొట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు.



Next Story

Most Viewed