నిరుద్యోగుల మిలియన్ మార్చ్‌కి బీజేపీ కసరత్తు

by  |
BJP logo
X

దిశ, తెలంగాణ బ్యూరో: నిరుద్యోగుల్లో భరోసా కల్పించేందుకు బీజేపీ చేపడుతున్న నిరుద్యోగ మిలియన్​మార్చ్​ను పక్కాగా నిర్వహించేందుకు బీజేపీ నాయకులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మిలియన్​మార్చ్​ నిర్వహించేందుకు అనుమతి ఇచ్చినా.. ఇవ్వకున్నా ఖచ్చితంగా నిర్వహించాలనే ప్లాన్​లో బీజేపీ నేతలున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లను ముమ్మరం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి భారీగా నిరుద్యోగులు, యువతను జన సమీకరణ చేయాలని ప్లాన్ ​చేస్తున్నారు. ఏది ఏమైనా 10 లక్షల మందిని పోగు చేయడమే టార్గెట్​గా రాష్ట్ర నేతలు పెట్టుకున్నారు. మిలియన్​ మార్చ్​ నిర్వహణకు సంబంధించి శుక్ర, శనివారాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ​సమీక్షలు నిర్వహించనున్నట్లు సమాచారం.

నిరుద్యోగుల మిలియన్ ​మార్చ్​ కోసం అన్ని జిల్లాల వారీగా నేతలు జన సమీకరణ చేసేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం నుంచి ఈ అంశంపై స్పష్టమైన ఆదేశాలు జిల్లా అధ్యక్షులకు వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం, పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా యువతను, నిరుద్యోగులను భారీగా ఈ మార్చ్​కు తరలించాలనే సంకల్పంతో బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్​ నడిబొడ్డున ఈ మార్చ్ ను నిర్వహిస్తామని ఇప్పటికే బీజేపీ నాయకులు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి నోటిఫికేషన్లు వేసే విధంగా చేస్తామని బీజేపీ శ్రేణులు టీఆర్​ఎస్​కు సవాల్​ విసిరారు. ఈ నేపథ్యంలోనే ఈ నిరుద్యోగుల మిలియన్​ మార్చ్ ను బీజేపీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.

ఉద్యోగ నోటిఫికేషన్లు లేక రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమంది నిరుద్యోగులు బలవన్మరణానికి పాల్పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు కొందరు తాము ఆత్మహత్య చేసుకున్న దృశ్యాలను ఏకంగా వీడియో తీసినా తెలంగాణ ప్రభుత్వం తన నిర్లక్ష్య ధోరణిని విడిచి నోటిఫికేషన్లు వేయలేదని బీజేపీ శ్రేణులు తీవ్రంగా విమర్శలు చేస్తోంది. ఇప్పుడివే అంశాలు అస్త్రాలుగా మల్చుకోని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేయనుంది. ఇప్పటికే ఇంకెందరి చావులు చూస్తే నోటిఫికేషన్లు వేస్తారని బీజేపీ శ్రేణులు కేసీఆర్​ను ప్రశ్నిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరిగిందని, నీళ్లు, నిధులు, నియామకాలే ధ్యేయంగా రాష్ట్రం సాధించినా నిరుద్యోగులు, యువతకు నిరాశే ఎదురైందని బీజేపీ నేతలు రాష్ట్ర సర్కార్​పై తీవ్రంగా మండిపడుతున్నారు.

రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేసేలా చూడటమే మిలియన్​ మార్చ్​ లక్ష్యంగా బీజేపీ శ్రేణులు పెట్టుకున్నారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోకుండా వారిలో భరోసా నింపి ప్రభుత్వంపై పోరాటం చేయాలని ఇప్పటికే వారు పిలుపునిచ్చారు. కాగా మిలియన్​ మార్చ్​ నిర్వహణకు అనుమతుల కోసం ఇప్పటికే బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ మిలియన్​ మార్చ్ ను అడ్డుకునేందుకు పోలీసులు అనుమతులు ఇవ్వకపోయినా సరే నిర్వహించి తీరాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఒకవేళ బీజేపీ అనుమతులివ్వకుంటే యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు విషయంపై టీఆర్ఎస్​ చేపడుతున్న ధర్నాకు ఎలా అనుమతులిచ్చారని ప్రశ్నించాలనే ప్లాన్​లో బీజేపీ నేతలున్నట్లు తెలుస్తోంది.

Next Story