‘రాముడి కోసం.. భిక్షమెత్తడానికి బీజేపీ సిద్ధం’

by  |
bjp mp bandi sanjay cm kcr
X

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ మానవత్వం లేని ఓ మానవ మృగమని, ప్రైవేటు టీచర్లు కరోనా టైమ్ నుంచి ఎన్నో ఇబ్బందులు పడుతున్నా వారి సమస్యలకు పరిష్కారం చూపలేదని, ప్రైవేటు స్కూళ్ళ యాజమాన్యాలతో చర్చలు జరపలేదని, కనీసం స్పందించే గుణం కూడా లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ముఖ్యమంత్రిగా సోయి లేకుండా వ్యవహరిస్తున్నారని, ప్రైవేటు టీచర్చలు డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తే పదిహేను రోజుల పాటు వారిని జైల్లో పెట్టారని, ఇదేనా పాలన అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ప్రైవేటు టీచర్లు కూడా పేదోళ్ళేనని, వారికి అన్యాయం జరుగుతున్నా ముఖ్యమంత్రి స్పందించడంలేదని, జైల్లో పెట్టినా వారు వెనకడుగు వేయలేదని, బీజేపీ వారికి అండగా ఉంటుందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ప్రైవేటు ఉధ్యోగుల సమస్యలకు పరిష్కారం చూపకపోతే రాబోయే ఎన్నికల్లో వారి సత్తా చూపిస్తారన్నారు. తెలంగాణలో ప్రస్తుతం ఏ ఒక్కరూ సంతోషంగా లేరన్నారు. రెవెన్యూ ఉద్యోగులు కూడా ప్రభుత్వంతో సంబంధం ఉన్నవారితో డైరీ ఆవిష్కరించుకునే ఉద్దేశంతో లేరని, అందుకే బీజేపీతో లాంఛింగ్ చేయించుకున్నారని గుర్తుచేశారు. రెండు సంవత్సరాల క్రితం మంచివారైన రెవెన్యూ ఉద్యోగులు ఇప్పుడు అవినీతిపరులయ్యారా అని సంజయ్ ప్రశ్నించారు.

కొత్త కొలువుల సంగతేమోగానీ ఉన్న ఉద్యోగాలు కూడా ఊడిపోతున్నాయని, తెలంగాణలో ఏం జరగబోతోందో ఆలోచించాలన్నారు. భూ సమస్యల పరిష్కారం కోసం ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తానని చెప్పిన సీఎం కేసీఆర్ మళ్ళీ కలెక్టర్‌లకే ఆ బాధ్యత అప్పగించారన్నారు. పేదోళ్ళ రక్తాన్ని పీల్చి ఆదాయం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం టీఆర్ఎస్ పరిస్థితి బాగలేదని, ముఖ్యమంత్రిని మార్చాలని చూస్తోందని, స్వంత పార్టీ నేతలను మభ్యపుచ్చడానికి కేంద్ర ప్రభుత్వంలో చేరనున్నట్లు లీకులు ఇస్తున్నారని కేసీఆర్‌పై విమర్శలు సంధించారు. ఉద్యోగులను నమ్మించేందుకు, తెలంగాణ సమాజాన్ని నాశనం చేసేందుకు కొత్త డ్రామా మొదలు పెట్టారన్నారు.

కొడుకును సీఎం పీఠంపై కూర్చోబెట్టడానికి రహస్యంగా యాగాలు చేయిస్తున్నారని, ఆ పూజా సామగ్రిని కాళేశ్వరంలో కలపడం కోసమే కుటుంబ సమేతంగా అధికారిక కార్యక్రమాన్ని ఏర్పాటుచేసుకున్నారని సంజయ్ ఆరోపించారు. నిజంగా యాగమే చేయకపోతే తాము చేసే ఆరోపణలను కేసీఆర్ ఎందుకు ఖండించడంలేదన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అని గుర్తించి ప్రజలు ఓట్లేశారని, పాలన చేతకాకపోతే దిగిపోయి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలిగానీ కేటీఆర్‌కు అప్పజెప్పడం పిరికితనమేనని అన్నారు. కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని ఇప్పుడు చెప్తున్నవారే రేపు మంత్రి పదవులు రాకపోతే కొత్త పార్టీ పెడతారన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం కావాలని ఉందో లేదో కేసీఆర్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రామాలయ నిర్మాణం కోసం కలిసికట్టుగా పనిచేద్దామని, రాజకీయాలు చేయడం ఆపమని కేసీఆర్ తన పార్టీ నేతలకు చెప్పాలన్నారు.

కేసీఆర్‌కు దమ్ముంటే టీఆర్ఎస్-బీజేపీ మధ్య పొత్తు ఉంటుందని ప్రెస్‌మీట్‌ పెట్టి బహిరంగంగా చెప్పాలని డిమాండ్ చేశారు. ఎప్పటికీ బీజేపీకి టీఆర్ఎస్‌తో పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు. ప్రజలు బీజేపీ వైపు ఆకర్షితులు అవుతున్నారని టీఆర్ఎస్ కొత్త డ్రామాకు తెరలేపిందని విమర్శించారు. అంతేగాకుండా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి.. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో గెలవాలని చూస్తోందని అన్నారు. రాముడి కోసం భిక్షమెత్తడానికి బీజేపీ సిద్ధంగా ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.



Next Story

Most Viewed