మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్

by  |
మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపడుతున్న యాత్రను చూసి మంత్రి కేటీఆర్ భయంతో ఏదేదో మాట్లాడుతున్నారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రం నుండి కేంద్రానికి పన్నుల రూపంలో చెల్లించే మొత్తంలో సగం కూడా ఇవ్వడం లేదని మంత్రి కేటీఆర్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. రాజ్యాంగంలో ఏదైతే పొందుపర్చబడిందో దానినే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోందన్నారు. రాష్ట్రాల నుండి వచ్చే ఆదాయం నుండే రక్షణ శాఖతో పాటు అన్ని శాఖలు, దేశంలోని రాష్ట్రాల అభివృద్ధి జరుగుతుందన్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు కేటాయిస్తున్నారని చెప్పారు. ఈ విషయం మంత్రి కేటీఆర్‌కు తెలియకపోతే తెలుసుకోవాలన్నారు. ఈ విషయాలన్నీ కేంద్ర మంత్రిగా పని చేసిన మీ తండ్రి (కేసీఆర్)ను అడిగి తెలుసుకోవాలని కేటీఆర్‌కు సూచించారు. తాను చెప్పిన అంశాలు తప్పని నిరూపిస్తే తాను కూడా రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, నిజమైన పక్షంలో మంత్రి కేటీఆర్ రాజీనామాకు సిద్ధమా అని రాజాసింగ్ సవాల్ విసిరారు.



Next Story

Most Viewed