రాజకీయం చేయాలనుకుంటే ఉద్యోగం వదిలేయ్.. రఘునందన్ రావు ఆగ్రహం

by  |
BJP MLA Raghunandan Rao
X

దిశ, సిద్ధిపేట: యాసంగి సాగుపై జరిగిన సమీక్షా సమావేశంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ న్యాయవ్యవస్థను కించపరిచేలా మాట్లాడరని, రాజ్యాంగ పదవిలో ఉండి అలా మాట్లాడటం సరికాదని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరి వేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం నుండి గానీ, సీఎస్ నుంచి గానీ ఏమైనా ఆదేశాలు వచ్చాయా.. వస్తే చూపించాలని డిమాండ్ చేశారు. ‘ముఖ్యమంత్రి జిల్లాలో తాను ఏది మాట్లాడినా చెల్లుతది అనుకుంటున్నారమో, సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావుకు అనుకూలంగా పనిచేస్తే చాలు అనుకుంటే సమంజసం కాదు. మూడేళ్ల కంటే ఎక్కువ కాలం ఒకేచోట పనిచేస్తే ఇలాగే ఉంటుంది. గత ఆరేళ్లుగా కలెక్టర్ ఇక్కడే పనిచేస్తున్నారు. అందుకే ఆయన ఇలా ప్రవర్తిస్తున్నారు. వెంటనే ఆయన్ను బదిలీ చేయాలి. న్యాయ వ్యవస్థను కించ పరిచేలా మాట్లాడారు.’ అని రఘునందన్ రావు మండిపడ్డారు.

కనీసం న్యాయమూర్తులైన స్పందించి సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ డీవోపీటీ సీనియర్ అధికారి అజయ్ భల్లా, తెలంగాణ ప్రభుత్వం ప్రిన్సిపాల్ సెక్రెటరీ వికాస్ రాజుతో పాటు మొత్తం నలుగురు ఉన్నతాధికారులకు లిఖిత పూర్వకంగా మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశానన్నారు. కలెక్టర్‌కు రాజకీయాల్లోకి రావాలని సోకున్నట్టుంది, ఒకవేళ రాజకీయాల్లోకి రావాలని ఉంటే వెంటనే ఉద్యోగాన్ని వదిలేయ్ అని హితవు పలికారు. ఈ ఆరేళ్లుగా సిద్దిపేట జిల్లాలో జరిగిన అక్రమాలపై ఒక్కొక్కటిగా వెలుగులో తెస్తామని వార్నింగ్ ఇచ్చారు.

కలెక్టర్ తన మాటలు వెనక్కి తీసుకొని 24 గంటల్లో రైతులకు క్షమాపణ చెప్పాలని, లేదంటే బీజేపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి చేస్తామని హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి వరిపంట సాగు చేయొద్దని ఏమైనా ఉత్తర్వులు వచ్చాయా? అని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్‌పై సీఎం కేసీఆర్ తన వైఖరి చెప్పాలని, లేకుంటే మీ ఇద్దరి బంధాలు, పెట్టుబడులు బయటకు తీస్తామన్నారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న జిల్లా కలెక్టర్ ఒక పార్టీకి కొమ్ము కాయడం సరికాదని, జిల్లా కలెక్టర్‌ను తొలగించే వరకు బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా నాయకులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed