‘ప్రజా సంగ్రామ యాత్ర’ తొలిరోజు సక్సెస్.. బండిని కృష్ణుడితో పోల్చిన నేతలు

by  |
BJP leaders
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేపట్టిన ‘ప్రజా సంగ్రామ యాత్ర’ తొలిరోజు సభ సక్సెస్ కావడంతో బీజేపీ కార్యకర్తల్లో, నాయకుల్లో కొత్త జోష్ నెలకొందని పార్టీ రాష్ట్ర పదాధికారుల సమావేశం ముక్త కంఠంతో అభిప్రాయపడింది. సభ విజయవంతానికి కృషి చేసిన పాదయాత్ర కమిటీ నిర్వాహకులకు రాష్ట్ర నాయకులు ప్రత్యేక అభినందనలు తెలిపింది. పాదయాత్ర సభ సక్సెస్‌తో తెలంగాణ సమాజంలో ఐక్యత వస్తోందని, ప్రత్యేకించి పాతబస్తీలోని హిందూ సమాజం ఏకమవుతోందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పాతబస్తీలో గత 20 ఏళ్లలో ఏ రాజకీయ పార్టీ కూడా ఈ స్థాయిలో సభ నిర్వహించిన దాఖలాల్లేవని, అది బండి సంజయ్ కుమార్ సారథ్యంలోని బీజేపీ పార్టీకే సాధ్యమైందని కొనియాడారు. సభ సక్సెస్‌తో పాతబస్తీలో ప్రతీ హిందువు కాషాయ జెండా పట్టుకుని ధైర్యంగా బయటకు వచ్చి సభలో, పాదయాత్రలో పాల్గొనడం సంతోషంగా ఉందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బండి సంజయ్ ప్రసంగం టైగర్ ఆలె నరేంద్ర ప్రసంగాన్ని, ధైర్యాన్ని గుర్తు చేసిందని స్మరించుకున్నారు.

BJP leaders

ఈ సందర్భంగా బండి సంజయ్ పదాధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. కార్యకర్తలందరి కష్టం వల్లే పాదయాత్ర తొలిరోజు సక్సెస్ అయ్యిందని చెప్పారు. సభతో పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ నెలకొందని హర్షం వ్యక్తం చేశారు. పాతబస్తీలోని హిందువుల్లో ధైర్యం నెలకొందని వారిలో ఐక్యత వస్తోందని చెప్పారు. కాషాయ జెండా పట్టుకుని ధైర్యంగా ముందుకు వస్తున్నారని తెలిపారు. కేసీఆర్ సభలను తలదన్నేలా సభను సక్సెస్ చేశారని కొనియాడారు. అందరి కృషి, సహాయ సహకారాలవల్లే ఇది సాధ్యమైందిని అన్నారు. సభ సక్సెస్ కోసం అహర్నిశలు కష్టపడిన పాదయాత్ర కమిటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. పాదయాత్రలో ఇకపై ఎలాంటి ఇబ్బందుల్లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. డీకే అరుణ మాట్లాడుతూ.. ‘‘పాదయాత్ర సభ సక్సెస్‌తో టీఆర్ఎస్ నేతల్లో అప్పుడే ఆందోళన మొదలైంది. పాదయాత్ర మొదటి దశ సంపూర్ణంగా విజయవంతం అవుతుందనే నమ్మకం ఏర్పడింది.’’ అని పేర్కొన్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ.. ‘‘పాతబస్తీలో ఏ రాజకీయ పార్టీ కూడా గత 20 ఏళ్లలో ఈ స్థాయిలో సభ నిర్వహించలేదు. ఈ సభతో బీజేపీ కార్యకర్తల్లో జోష్ నెలకొన్నది. బీజేపీ పాతబస్తీలో మరింత పటిష్టం అవుతుందనే నమ్మకం ఏర్పడింది. సభ నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు’’ అని తెలిపారు. శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ మాట్లాడుతూ.. ‘‘నిన్నటి పాదయాత్ర సభను చూస్తే నాటి కురుక్షేత్ర సంగ్రామంలో కృష్ణుడి శంఖాన్ని పూరించి యుద్ధాన్ని ఆరంభించిన ఘట్టాన్ని తలపించింది. పాతబస్తీ పూర్తిగా కాషాయమయమైంది. పోలీసులు, అధికార పార్టీ నేతలు ఇబ్బంది పెట్టాలని చూసినా వాటన్నింటినీ అధిగమించి సభను సక్సెస్ చేశారు. ఈ విషయంలో పాదయాత్ర నిర్వాహకుల కృషి అభినందనీయం’’ అని తెలిపారు.

అనంతరం నాయకులు నల్లు ఇంద్రసేనారెడ్డి, మాజీ మంత్రి బాబూమోహన్, మాజీ ఎంపీ గరికపాటి మోహన్ రావు, పేరాల శేఖర్ రావు, ప్రేమేందర్ రెడ్డిలు మాట్లాడుతూ… పాదయాత్ర సక్సెస్‌తో ఇతర పార్టీల సభలతో పోలుస్తూ జనంలో అప్పుడే చర్చ మొదలైందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, కార్యకర్తలు పాదయాత్ర పట్ల ఆసక్తి కనబరుస్తున్నారని వివరించారు. వారిని పాదయాత్రకు, సభలకు తీసుకురాగలిగితే విజయవంతం అయినట్లేన్నీ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలతోపాటు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను కూడా పాదయాత్ర ద్వారా జనంలోకి తీసుకెళ్లాలని చెప్పారు. దీంతోపాటు పాదయాత్ర జరిగే ప్రాంతాల్లోని సమస్యలనూ ప్రస్తావిస్తూ ప్రభుత్వ తీరును ఎండగట్టాలని సూచించారు. ఎమ్మెల్యే రఘునందన్ రావు, రవీంద్రనాయక్, మాజీ మంత్రులు విజయరామారావు, శ్రీనివాసులు, బంగారు శ్రుతి, పాదయాత్ర కమిటీ ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, కోశాధికారి శాంతికుమార్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, ఎస్సీ, బీసీ, మహిళా మోర్చాల రాష్ట్ర అధ్యక్షులు కొప్పు బాషా, ఆలె భాస్కర్, గీతామూర్తి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాశ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు ప్రకాశ్ రెడ్డి, ఉమారాణి, అధికార ప్రతినిధులు రాకేశ్ రెడ్డి, కృష్ణ సాగర్ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed