బ్రేకింగ్ : బీజేపీ నాయకులు హౌస్ అరెస్ట్

by  |
బ్రేకింగ్ : బీజేపీ నాయకులు హౌస్ అరెస్ట్
X

దిశ, దుబ్బాక : దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు శుక్రవారం ఉదయం హౌస్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో అక్రమ అరెస్టులతో మాకు ఒరిగేది ఏమీ లేదని బీజేపీ నాయకులు మండిపడ్డారు. రైతుల పక్షాన నిలబడి వారికి న్యాయం చేసేందుకు దేనికైనా సిద్ధమని స్పష్టం చేశారు. రైతులను అవమానపరిచే విధంగా మాట్లాడిన కలెక్టర్ వెంకట్రామిరెడ్డి క్షమాపణ చెప్పాలనే డిమాండ్‌తో శుక్రవారం ఎమ్మెల్యే రఘునందన్ రావు బీజేపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి‌కి పిలుపునిచ్చారు. అయితే సమాచారం తెలుసుకున్న పోలీసులు సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం వ్యాప్తంగా బీజేపీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. తెల్లవారుజామున నాలుగు గంటల నుండే పోలీసులు బీజేపీ నాయకుల ఇండ్ల వద్దకు చేరుకుని కొంత మందిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలించి, మరికొందరిని గృహ నిర్బంధం చేశారు.

ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ అక్రమ అరెస్టులతో తమ ఉద్యమాన్ని ఆపలేరని, రైతుల మేలు కోసం బీజేపీ నాయకులు‌గా దేనికైనా సిద్ధం అన్నారు. ఒక జిల్లా అధికారిగా రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాల్సిన కలెక్టర్ ఒక పార్టీ కార్యకర్తగా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. రాజకీయం పట్ల అంత ప్రేమ ఉంటే తమ ఉద్యోగానికి రాజీనామా చేసి టీఆర్ఎస్ కండువ కప్పుకొని రావాలని హెచ్చరించారు. ఒక పార్టీకి గానీ, ఒక ప్రభుత్వానికి గాని కొమ్ముకాసే ఉద్యోగులు ఉండకూడదని మండిపడ్డారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలని లేనిపక్షంలో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అరెస్టయిన వారిలో కౌన్సిలర్ మల్లారెడ్డి, సుభాష్ రెడ్డి, మచ్చ శ్రీనివాస్, ఎంపీటీసీ రవిందర్, కృష్ణ, బాలేష్ గౌడ్ తదితరులు ఉన్నారు.



Next Story