ఆ పథకాన్ని అమలు చేయాలని ఎమ్మెల్యేను అడ్డుకున్న బీజేపీ నాయకులు

by  |
ఆ పథకాన్ని అమలు చేయాలని ఎమ్మెల్యేను అడ్డుకున్న బీజేపీ నాయకులు
X

దిశ, హుస్నాబాద్: దళితబంధు పథకాన్ని హుస్నాబాద్ నియోజకవర్గంలో అమలు చేయాలని బీజేపీ ఆధ్వర్యంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్ వాహనాన్ని శనివారం అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు చెక్కబండి విద్యాసాగర్ రెడ్డి మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిల్ల గ్రామంలోని పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళుతున్న స్థానిక ఎమ్మెల్యేకు ప్రజాసమస్యలపై వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నం చేశామన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో అమలు చేస్తున్న దళితబంధు పథకాన్ని హుస్నాబాద్ లో అమలుతో పాటు, అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వాలని కోరారు.

అంతేకాకుండా పందిల్ల గ్రామశివారులోని రేణుక ఎల్లమ్మవాగుపై ఇటీవల నిర్మించిన చెక్ డ్యాం ఏడాది కాకముందే ధ్వంసమైందన్నారు. కాంట్రాక్టర్లు ఇస్తున్న మామూళ్ల మత్తులో అధికారులు తూగుతూ వేల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలను విన్నవించేందకు వచ్చిన మాకు ఎమ్మెల్యే మూడు గంటలైన టైం ఇవ్వలేదన్నారు. దీంతో ఎమ్మెల్యే కాన్వాయ్‌ని బీజేపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేయగా, పోలీసులకు, బీజేపీ నేతలకు మధ్య కాస్త తోపులాట చోటుచేసుకుంది. ఎట్టకేలకు బీజేపీ నేతలను పోలీసులు పక్కకు నెట్టేయడంతో ఎమ్మెల్యే కాన్వాయ్ వెళ్ళిపోయింది. అనంతరం బీజేపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు.

ఇప్పటికైనా ఎమ్మెల్యే స్పందించి సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకొని త్వరితగతిన చెక్ డ్యాం పనులు పునఃనిర్మించాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతామని బీజేపీ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బొమ్మగాని రవీందర్ గౌడ్, తాడూరి బాల్ రాజు, తాడూరి యాదగిరి, తాడూరి రాజాబాబు, తాడూరి కిష్టయ్య, బొమ్మగాని శివ, తాళ్లపల్లి చంద్రం, సత్యం బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed