బంగారు బోనమెత్తిన రాములమ్మ..

by  |
బంగారు బోనమెత్తిన రాములమ్మ..
X

దిశ, చార్మినార్​ : పాతనగరం బోనమెత్తింది. మహంకాళి బోనాల జాతరకు భక్త జనం పోటెత్తింది. గళ్లీ గళ్లీలో మహంకాళి భక్తి గీతాలతో భాగ్యనగరం దద్దరిల్లింది. డప్పుల దరువు.. పోతరాజుల వీరంగం ..శివసత్తుల చిందులు..ఆలయ పరిసరాలలో ఎటుచూసిన కోలాహలం..భాగ్యనగరంలోభక్తి పారవశ్యం తాండవించింది. ఆడపడుచుల సంప్రదాయ అలంకరణలో కొత్తకళసంతరించుకుంది. మహిళలు ఆదివారం తెలారుజాము నుంచే బోనాలు నెత్తిన పెట్టుకుని అమ్మవారి దర్శనం కోసం బారులుదీరారు. ప్రతిష్ఠాత్మకంగా జరిగిన బోనాల పండుగలోతెలంగాణ సంస్కృతి ఉట్టిపడింది. తెలంగాణ ప్రాంతంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరుపుకునే బోనాల ఉత్సవాలు ఆదివారం భాగ్యనగరంలో అంగరంగవైభంగా జరిగాయి. బోనాల పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. చిన్న, పేద తేడా లేకుండా నగరంలోని వందలాది దేవాలయాలలో లక్షలాదిమంది భక్తలు పాల్గొని, తమ మొక్కులు తీర్చుకున్నారు.

పాతనగరంలోని లాల్​దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయం తెల్లవారు జామునుంచే భక్తులతో కిటకిటలాడింది. దేవాలయాన్ని దర్శించుకున్న భక్తులు తమ కోర్కెలను తీర్చమని అమ్మవారిని వేడకున్నారు. అంటురోగాల భారిన పడకుండా కాపాడు తల్లీ అని దండం పెట్టుకున్నారు. ప్రధానంగా మహిళలు, చిన్న పిల్లలు తెలంగాణ సంప్రదాయ దుస్తులు ధరించి బోనం, అమ్మవారికి నైవేద్యాలతో దేవాలయాలకు తరలివచ్చి తమ మొక్కులను తీర్చుకున్నారు. లాల్​దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయం, హరిబౌళి శ్రీ అక్కన్న మాదన్న దేవాలయం, శ్రీ బంగారుమైస్మ దేవాలయం, మీరాలం మండి శ్రీ మహంకాళి దేవాలయం, చార్మినార్​ భాగ్యలక్ష్మి దేవాలయం, గౌలిపురా శ్రీ మహంకాళి దేవాలయం, ఉప్పుగూడ శ్రీ మహంకాళి దేవాలయం, చందులాల్​ బేలాలోని శ్రీ ముత్యాలమ్మ దేవాలయం, అలియాబాద్​లోని శ్రీ దర్బార్​ మైసమ్మ దేవాలయం, చాంద్రాయణగుట్టలోని బంగారు మైసమ్మ దేవాలయం, శ్రీ కనకదుర్గ దేవాలయాలను, మేకల్​ బండ శ్రీ నల్లపోచమ్మ దేవాలయం తదితర ఆలయాలకు భక్తలు వేలాదిగా తరలివచ్చి బోనాల సమర్పించారు. ఆదివారం బోనాల పండుగ పర్వదినం సందర్భంగా ఆయా ఆలయాలలో మహాభిషేకం, శాంతి కళ్యాణం ప్రత్యేక పూజలతో పాటు తలంబ్రాలు, పట్టువస్త్రాలను సమర్పించారు.

ప్రముఖుల సందర్శన …

గత ఏడాదికోవిడ్​ కారణంగా ప్రభుత్వ నియమనిబంధనలకు అనుగుణంగా ఆలయ కమిటీ మాత్రమే ఆలయాలలో బోనాలు సమర్పించారు. గత ఏడాది నిరాడంబరంగా బోనాల ఉత్సవాలు నిరాడంబరంగా నిర్వహించారు. ఈ సారి తెలంగాణ ప్రభుత్వం బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి 15 కోట్లు నిధులు మంజూరు చేశారు. దీంతో ఈ సారి నేతల తాకిడి మళ్లీ పెరిగింది. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి, హోంశాఖా మంత్రి మహమూద్​ ఆలీ, పశుసంవర్థక శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​లు రాష్ట్రం ప్రభుత్వం తరపున మహంకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు తలంబ్రాలు సమర్పించారు.

హర్యానా గవర్నర్​ బండారుదత్తాత్రేయ దంపతులు సింహవాహిని మహంకాళికి బంగారుబోనం, పట్టువస్త్రాలు సమర్పించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, బీజేపీ నేత సినీ నటి విజయశాంతి అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపి రేవంత్​రెడ్డి, ఎమ్మెల్యేదానం నాగేందర్​, టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ అంజన్​కుమార్​ యాదవ్​, ఎమ్మెల్యే శ్రీదేవి, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్, టీటీడీ బోర్డు మెంబర్ శివకుమార్, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి,సింగర్​ మధుప్రియ, హైదరాబాద్​ కంటెస్టెడ్​ ఎంపి ఫేరోజ్​ఖాన్​, లింగోజిగూడ కార్పొరేటర్​ రాజశేఖర్​రెడ్డి, గోల్కొండ శ్రీ జగదాంబ దేవాలయం కమిటీ ప్రతినిధులు గోవింద్​ రాజ్, జీవన్​రాజ్​లు అమ్మవారి ఆలయాలను సందర్శించారు.


Next Story

Most Viewed