తెలంగాణలో వ్యాక్సినేషన్ ఎందుకు నిలిపివేశారు?

by  |
తెలంగాణలో వ్యాక్సినేషన్ ఎందుకు నిలిపివేశారు?
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో6.90లక్షలకు పైగా వ్యాక్సిన్ డోసులు నిల్వ ఉన్నా మూడు రోజులుగా వ్యాక్సినేషన్‌ను ఎందుకు నిలిపివేశారని బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సర్కార్ విషయంలో ఎటు చూసినా వైఫల్యాలేనని మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పరిస్థితులను చక్కబెట్టేందుకు అవసరమైన ప్రణాళికలను ప్రభుత్వం ఏమాత్రం రచించడం లేదని మండిపడ్డారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చలేదని, ఆయుష్మాన్ భారత్ తెలంగాణలో అమలు కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న అవాంఛనీయ పరిణామాలపై గతంలోనే సత్వర చర్యలు తీసుకొని ఉంటే, పరిస్థితి ఇంత తీవ్రరూపం దాల్చేదే కాదని అభిప్రాయపడ్డారు. మల్లాపూర్‌కు చెందిన ఓ గర్భిణిని చేర్చుకోడానికి ఐదు ఆస్పత్రులు నిరాకరించడంతోనే మృతి చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే రైతు పండించిన ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ అత్యంత ఉదాసీనతతో వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ధాన్యం వర్షం పాలై, రైతులు మరోసారి తీవ్రంగా నష్టపోయారని విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయడంతోపాటు తరుగు పేర మిల్లర్లు కోత విధించకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.



Next Story