బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు.. ఓటుకు 20 వేలు ఇచ్చినా..

by  |
బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు.. ఓటుకు 20 వేలు ఇచ్చినా..
X

దిశ, హుజూరాబాద్ : అవినీతి సొమ్ముతో హుజూరాబాద్ ప్రజలను మభ్యపెట్టలేరని బీజేపీ కోర్ కమిటీ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. గురువారం పట్టణంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐదు నెలలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం దిగజారుడు రాజకీయాలను చేస్తుందని విమర్శించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలనే టీఆర్ఎస్ నేతలు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు.

అప్పటి పాలకులు నిర్బంధంగా తెలంగాణ ఉద్యమాన్ని అణచివేస్తే ప్రత్యేక రాష్ట్రం సిద్ధించేదా అని ప్రశ్నించారు. భయపెట్టిన, నిర్బంధించినా కెసీఆర్ అహాంకారానికి హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గుణపాఠం తప్పదన్నారు. ఒక్కో ఓటుకు రూ. 20 వేలు ఇచ్చిన టీఆర్ఎస్‌కు హుజూరాబాద్లో ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాలను విస్మరించి హుజూరాబాద్‌లో అభివృద్ధి చేస్తామని హామీలు గుప్పించడం విడ్డూరంగా ఉందని అన్నారు. కల్వకుంట్ల కుటుంబానికి చరమగీతం పాడితేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. కేసీఆర్ ఎన్ని పన్నాగాలు పన్నిన ఈటల గెలుపు ఆపలేరని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, నాయకులు గంగిశెట్టి ప్రభాకర్, గంగిశెట్టి రాజు, పల్లేని దేవేందర్ రావు తదితరులు పాల్గొన్నారు.



Next Story