పదివేల మందికి తగ్గకుండా రావాలి.. ప్రేమేందర్ రెడ్డి పిలుపు

by  |
BJP leader Premender Reddy
X

దిశ, సిద్దిపేట: అవినీతి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్‌తో కలిసి ప్రేమేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్ పాదయాత్రకు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోందని అన్నారు. 35 రోజుల పాటు కొనసాగిన పాదయాత్ర హుస్నాబాద్ బహిరంగ సభతో ముగియనుందని తెలిపారు. వారసత్వ రాజకీయాలు, అవినీతి అంతం కోసమే రాష్ట్రంలో బీజేపీ పాదయాత్ర చేస్తోందని వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తోన్న జిల్లాలో ప్రజలంతా ప్రభుత్వం వ్యవహరిస్తోన్న విధానాలను ఎండగట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రాబోయే రోజుల్లో అన్ని జిల్లాలకు కేంద్రం మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తోందని తెలిపారు.

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంతో అభివృద్ధి చెందామని, ఆయుధాలను విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి భారత్ ఎదిగిందని, ఇది దేశానికే గర్వకారణమని కొనియాడారు. రైతుల పట్ల చిత్తశుద్ధితో పండించిన పంటను కేంద్రమే కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. హుజురాబాద్‌లో గెలిచేందుకు టీఆర్ఎస్ అనేక కుట్రలు చేస్తూ.. కోట్ల రూపాయల డబ్బులు జల్లుతోందని ఆరోపించారు. టీఆర్ఎస్ ఎన్ని వేషాలు వేసినా.. హుజురాబాద్‌లో ఎగిరేది కాషాయ జెండానే అని ధీమా వ్యక్తం చేశారు. హుస్నాబాద్‌లో జరిగే బహిరంగ సభకు సిద్దిపేట జిల్లా నుంచి 10 వేలకు తగ్గకుండా హాజరు కావాలని చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొని పాదయాత్ర ముగింపు సభను విజయవంతం చేయాలని ప్రేమేందర్ రెడ్డి కోరారు. ఈ సమావేశంలో నాయకులు బాలేష్ గౌడ్, మల్లేశం, నరేష్, సురేష్ గౌడ్, విద్యాసాగర్, శ్రీనివాస్ యాదవ్, అరుణరెడ్డి, మార్కండేయులు తదితరులు పాల్గొన్నారు.

Next Story