2023 ఎన్నికలే లక్ష్యం.. డీకే అరుణ కీలక సూచనలు

by  |
BJP leader DK Aruna
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: మరో రెండున్నర ఏళ్లలో రానున్న శాసనసభ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ సమిష్టిగా పనిచేయాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ సూచించారు. మంగళవారం పాలమూరు జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయాన్ని ఆమె సందర్శించారు. ఇటీవల జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వీర బ్రహ్మచారిని అభినందించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు వీర బ్రహ్మచారి, ఇతర ముఖ్యనేతలతో పార్టీ పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలను గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బూత్ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.

కష్టపడి పనిచేసే వారికే రానున్న రోజుల్లో పదవులు, బాధ్యతలు లభిస్తాయని ఆమె వెల్లడించారు. అధికార టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రజావ్యతిరేక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాలరాజు, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, పవన్ కుమార్ రెడ్డి, కృష్ణ వర్ధన్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, క్రిస్టియన్ నాయక్, కౌన్సిలర్లు అంజయ్య, రామాంజనేయులు, చెన్న వీరయ్య తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed