‘ఉద్యోగాలనే కాదు.. ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడాం’

by  |
DK Aruna
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యోగాలనే కాదు.. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాటాలు చేశాం. ఇప్పుడూ అధికార పార్టీ నేతల బెదిరింపులకు అదిరేదిలేదు.. బెదిరేదిలేదు. ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోండి. ఈ దగాకోరు ప్రభుత్వ పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైంది. ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా కేసీఆర్‌కు తగిన గుణపాఠం చెప్పాలి’ అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పట్టభద్రులకు పిలుపునిచ్చారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆ రోజుల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులే కాదు.. ప్రతిఒక్కరూ పోరాటాలు చేశారన్నారు. అప్పుడు కేసీఆర్ అనుచరగణం యువతను రెచ్చగొట్టడంతోనే 1200 మందికి పైగా తమ ప్రాణాలను అర్పించారని, ఇప్పుడూ కొనసాగుతున్న రాక్షస పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగించేందుకు ఓటు ద్వారా సమాధానం ఇవ్వాల్సిన అవసరముందన్నారు.

ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తున్న బెదిరింపులకు ఏమాత్రం భయపడొద్దని ఓటర్లకు సూచించారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను ఓడిస్తేనే రానున్న రోజుల్లో కొత్త ఉద్యోగాలు, ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్ మాట్లాడుతూ.. కేసీఆర్ ఉద్యోగులను, ఉపాధ్యాయులను భోజనాలకు పిలిపించుకొని మళ్ళీ కల్లిబొల్లి మాటలతో మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ వాటికి ఓటర్లు లొంగవద్దని సూచించారు. వారి వెంట బీజేపీ నేతలు పద్మజారెడ్డి, వీర బ్రహ్మచారి, పడాకుల బాలరాజు, అంజయ్య, కృష్ణ వర్ధన్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed