కబ్జాలపై ప్రశ్నిస్తే గులాబీ లీడర్లకు కోపం : బండి సంజయ్

by  |
కబ్జాలపై ప్రశ్నిస్తే గులాబీ లీడర్లకు కోపం : బండి సంజయ్
X

దిశ, వెబ్‌డెస్క్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. వరద ప్రవాహంలో చిక్కుకున్న వారిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ వరంగల్ పట్టణంలో పర్యటించారు.అక్కడి ప్రజల యోగాక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. వరంగల్ నగరానికి ఈ పరిస్థితి రావడానికి టీఆర్‌ఎస్ పార్టీ లీడర్లే కారణమన్నారు. ఎక్కడిక్కడ భూములు కబ్జా చేసి నాలాలపై నిర్మాణాలు చేయడం వల్లే ఈ దుస్థితి వచ్చిందన్నారు. కబ్జాల గురించి మాట్లాడితే స్థానిక అధికారపార్టీ లీడర్లకు కోపం వస్తుందని బండి సంజయ్ విమర్శించారు. ఎన్నికల సమయంలో అది చేస్తాం.. ఇది చేస్తాం.. అని ప్రగల్భాలు పలికిన సీఎం కేసీఆర్ పత్తా లేకుండా పారిపోయారని ధ్వజమెత్తారు. అధికార పార్టీ చేతగానితనం వల్లే ఓరుగల్లు ప్రజలు ఇవాళ ప్రాణాలు అరచేత పట్టుకుని జీవనం సాగిస్తున్నారని ఫైర్ అయ్యారు.

వరదల వలన నష్టపోయిన బాధితులకు ఆత్మస్థైర్యం, భరోసా ఇవ్వాల్సిన బాధ్యత పాలకులపై ఉందని.. ఆ ప్రయత్నాలు చేయకపోవడం వల్లే ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోవడం పాటు ప్రజాప్రతినిధులు అడ్డదారిలో చెరువులు, కుంటలు, నాళాలు కబ్జా చేసి, అక్రమ లే అవుట్లు వేసి.. ధనార్జనే ధ్యేయంగా పనిచేశారన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సరిగా లేకపోవడం వలనే ఈ వరదలు పట్టణాన్ని ముంచెత్తాయన్నారు.రాష్ట్రం భారీ వర్షాల వలన ఇబ్బందులు పడుతుంటే సీఎం కేసీఆర్ ఇంతవరకు స్పందించకపోవడం శోచనీయమన్నారు.


Next Story