షాకింగ్‌ న్యూస్.. ఈటల ఓటమికి సొంత నేతల కుట్ర..!

by  |
షాకింగ్‌ న్యూస్.. ఈటల ఓటమికి సొంత నేతల కుట్ర..!
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీజేపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. సొంత పార్టీ నేతలే ఈటల ఓటమిపై గురిపెట్టాయి. దీంతో బీజేపీ పద్మవ్యూహంలో ఈటల చిక్కుకున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కిషన్‌రెడ్డి, బండి సంజయ్ వర్గాలు వేరు వేరుగా ఉంటున్నాయని ప్రచారం సాగుతోంది. అయినా తన సెగ్మెంట్‌లోని గ్రామాల్లో బీజేపీ కీలక నేతలు వచ్చినా.. రాకున్నా పాదయాత్ర సాగించిన ఈటల.. అనారోగ్య కారణాలతో కాస్త సైలెంట్ అయ్యారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ‘ఆశీర్వాద యాత్ర’, పార్టీ స్టేట్​చీఫ్​బండి సంజయ్​‘ప్రజా సంగ్రామ యాత్ర’ ఎవరి టీం వారిదే అన్నట్టుగా సాగుతున్నది. జన ఆశీర్వాద యాత్ర ప్రారంభం రోజున కిషన్ రెడ్డికి తెలంగాణ బార్డర్‌లో స్వాగతం పలికిన బండి సంజయ్.. తిరిగి అటువైపు వెళ్లలేదు. బండి నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్రకు సైతం కిషన్ రెడ్డి మొదటి రోజు మాత్రమే హాజరయ్యారు.

రాష్ట్రం చూపు ఓ వైపు.. బీజేపీ నేతలు మరో వైపు..

ప్రస్తుతం రాష్ట్రం చూపు మొత్తం హుజూరాబాద్ ఉప ఎన్నికపైనే ఉంది. ఇక్కడ ఎలాగైనా ఈటలపై విజయం సాధించాలని సీఎం కేసీఆర్ ప్రణాళికలు రచిస్తున్నారు. ఇక్కడి నుంచే అనేక పథకాలను ప్రారంభిస్తున్నారు. మంత్రులు సైతం గ్రామాల్లోని గల్లీల్లో తిరుగుతూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఓ సారి నియోజకవర్గంలో పర్యటించిన సీఎం.. మరో మూడు సార్లు పర్యటించనున్నారని సమాచారం. ఇక్కడ ఇంత రాజకీయ వేడి రాజుకుంటే బీజేపీ నేతలు మాత్రం లైట్ తీసుకుంటున్నారు. హుజూరాబాద్​నియోజకవర్గంలో ఈటల రాజేందర్​పాదయాత్ర మొదలుపెట్టినా ఆయన అనారోగ్య కారణాల వల్ల యాత్ర ఆగిపోయింది. అక్కడి నుంచే బీజేపీ శ్రేణులు దాన్ని కొనసాగిస్తారని అందరూ భావించారు. కానీ ఎవరూ పట్టించుకోలేదు. బండి సంజయ్ ప్రత్యేకంగా హైదరాబాద్‌లో ప్రారంభించిన యాత్రలోనే ఆయన వర్గమంతా నిమగ్నమైంది.

ముఖ్యనేతలు దూరం..

రెడ్డి వర్గానికి చెందిన కీలక నేతలు కిషన్​రెడ్డి వెంట ఉంటున్నారనే చర్చ కొనసాగుతున్నది. అయితే ఇప్పటి వరకు హుజూరాబాద్​వైపు కిషన్‌రెడ్డి, డీకే అరుణ వంటి నేతలెవ్వరూ వెళ్లలేదు. హుజూరాబాద్‌కు ఇన్‌చార్జిగా ఉండటంతో మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి మాత్రమే నియోజకవర్గానికి వెళ్తున్నారు. కానీ, కిషన్‌రెడ్డి వర్గం మాత్రం దూరంగానే ఉంటోంది. దుబ్బాకలో గెలుపు, గ్రేటర్​హైదరాబాద్‌లో టఫ్​పోటీ ఇచ్చిన తర్వాత అధిష్టానం దగ్గర బండి సంజయ్ జోరు పెరిగింది. ఆ తర్వాత మండలి ఎన్నికలు, నాగార్జున‌సాగర్​ ఉప ఎన్నికలో ఘోర వైఫల్యాలను మూటగట్టుకుంది. ఇది బండి సంజయ్ ఫెయిల్యూర్‌ అని అధిష్టానం దగ్గర కిషన్‌రెడ్డి వర్గం చూపించినట్టు పార్టీలో చర్చ నడుస్తున్నది.

ఇదే సమయంలో హుజూరాబాద్‌లో ఈటల గెలిస్తే సంజయ్‌కు మళ్లీ ఊపు వచ్చే అవకాశం ఉందని, అందుకే హుజూరాబాద్‌లో ఈటల గెలవకుండా ఈ వర్గం ప్రయత్నాలు చేస్తున్నట్టు టాక్. ఇప్పటికే అధిష్ఠానం కిషన్‌రెడ్డికి ప్రాధాన్యత పెంచి కేబినెట్‌లో పదోన్నతి కల్పించింది. ఇలాంటి సమయంలో రాష్ట్రంలో బండి సంజయ్​ఫెయిల్యూర్‌ను సైతం తన ఖాతాలో వేసుకుంటే మరింతగా అధిష్ఠానం వద్ద పట్టు పెరుగుతుందని కిషన్‌రెడ్డి భావిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. కిషన్‌రెడ్డి ఇటీవలే ప్రజా ఆశీర్వాద యాత్ర నిర్వహించగా.. ఆ యాత్ర వరంగల్​వరకు వెళ్లినా.. హుజూరాబాద్‌కు వెళ్లేందుకు రూట్​మ్యాప్​చేయలేదు. దీనిపైనా బీజేపీ శ్రేణుల్లో పలు రకాల చర్చ సాగుతున్నది. దీన్ని ఈటల వర్గం మాత్రం సీరియస్‌గా తీసుకుంటున్నది. యాత్ర హుజూరాబాద్‌కు రాకపోవడానికి వర్గ విబేధాల కారణమేనంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సైలెంట్‌గా ‘బండి’ వర్గం..

దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ నేతలంతా కలిసి ప్రదర్శించిన సమిష్టి కృషి హుజూరాబాద్‌లో కనిపించడం లేదు. ఈటల రాజేందర్​బీజేపీలో చేరినా.. సీనియర్ల నుంచి పెద్దగా ఆదరణ దక్కడం లేదు. బండి సంజయ్​వర్గానికి సైతం ఈటల రాజేందర్ గెలుపు పట్టడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ ఈటల విజయం సాధిస్తే సీఎం కేసీఆర్‌ను ఢీ కొట్టి గెలిచిన నేతగా ఆయనకు గుర్తింపు వస్తోంది. బీసీ నేత కావడం ఆయన కీలకంగా మారే అవకాశాలున్నాయని బండి వర్గం భావిస్తున్నట్టు బీజేపీలోని మరోవర్గం ప్రచారం చేస్తోంది. అందుకే రాష్ట్రమంతా హుజూరాబాద్​పై కన్నేస్తే.. బండి మాత్రం పాదయాత్రలో బిజీ అయ్యారని టాక్.

రెండు వర్గాల లక్ష్యం ఒక్కటే..!

బీజేపీ పార్టీలో రాష్ట్రంలో ఇప్పటి వరకు రెండు వర్గాలున్నాయనేది జగమెరిగిన సత్యమే. ఈ రెండు వర్గాల ప్రస్తుత టార్గెట్​ఈటల ఓటమేని బీజేపీ నేతల్లో ప్రచారం జరుగుతున్నది. ఇందులోనూ ఒక వర్గం సీఎం కేసీఆర్​కోవర్టుగా మారిందని ముద్రపడింది. ఆ వర్గం హుజూరాబాద్‌లో ఈటలను ఓడించేందుకు టీఆర్ఎస్‌కు సహకరిస్తుందంటూ మరో వర్గం బీజేపీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేసిందనే ప్రచారం సైతం జరుగుతున్నది. బీజేపీలో చేరిన ఈటలను ఈ రెండు వర్గాలు దూరం పెట్టాయి. ఈటల గెలిస్తే ఆయనకు ఉన్నత అవకాశాలు, గుర్తింపు లభిస్తుందని, రాష్ట్రంలో సీఎం అభ్యర్థి ఆయనే అవుతారని అందువల్లే ఆయనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే కిషన్‌రెడ్డి, బండి సంజయ్ సీఎం అభ్యర్థులు అంటూ ఆయా వర్గాలు బలంగా భావిస్తున్నారు. ఇప్పుడు ఈటల గెలిస్తే కొత్త తలనొప్పి ఏర్పడే అవకాశం ఉండటంతో ఆయనకు బీజేపీ నేతలు అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారని టాక్.



Next Story