తృణమూల్ కాంగ్రెస్‌లోకి యశ్వంత్ సిన్హా

by  |
తృణమూల్ కాంగ్రెస్‌లోకి యశ్వంత్ సిన్హా
X

కోల్‌కతా : బీజేపీ మాజీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా శనివారం తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. శనివారం ఆయన కోల్‌కతాలోని టీఎంసీ భవన్‌కు వెళ్లారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆయన దీదీ పార్టీలో చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశం మునుపెన్నడూ ఎరుగని సంక్షోభాన్ని నేడు ఎదుర్కొంటున్నదని అన్నారు. ప్రజాస్వామ్యం బలం దాని వ్యవస్థల్లో ఉంటుందని వివరించారు. న్యాయవ్యవస్థ సహా ప్రజాస్వామిక వ్యవస్థలన్నీ నేడు బలహీనమయ్యాయని పేర్కొన్నారు. అటల్‌జీ కాలంలో బీజేపీ అందరి అభిప్రాయాలపై నిర్ణయాలు తీసుకునేదని, కానీ, నేటి ప్రభుత్వం అణచివేత, ఆక్రమణలనే విశ్వసిస్తున్నదని అన్నారు. అకాలీ, బీజేడీలు బీజేపీని వదిలిపెట్టాయని, బీజేపీతో పాటుగా నేడు నిలిచేదెవరని? అడిగారు.

దేశవ్యాప్తంగా బీజేపీకి ధీటుగా నిలుస్తున్న లీడర్‌గా పేరు సంపాదించుకుంటున్న మమతా బెనర్జీ నాయకత్వాన్ని విపక్ష నేతలు చాలా మంది ప్రశంసిస్తున్నారు. బెంగాల్‌లో మళ్లీ దీదీనే అధికారాన్ని చేపట్టే అవకాశముందని సర్వేలు వెల్లడించాయి. కానీ, బీజేపీ వేగంగా పుంజుకుంటూ టీఎంసీకి సవాల్ విసురుతున్నది. అదిగాక, చాలా మంది సీనియర్ టీఎంసీ నేతలు బీజేపీలోకి చేరుతుండటం అధికారపార్టీలో ఒకింత కలకలం రేగింది. రాష్ట్ర మాజీ మంత్రి సువేందు అధికారి సహా పలువురు టీఎంసీ నేతలు బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ తరుణంలో బీజేపీ మాజీ నేత యశ్వంత్ సిన్హా టీఎంసీలో చేరడం గమనార్హం.


Next Story