రోజక్క రొయ్యల పులుసు వల్లే నీటి పంచాయతీ.. బండి సంజయ్ సెటైర్

by  |
BJP chief Bandi Sanjay
X

దిశ, నాగర్ కర్నూల్: మన నీళ్లు మనకే కావాలని తెగించి, కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఒక అరాచకమైన పరిపాలన కొనసాగుతోందని, మళ్లీ ఓట్లు దండుకోవాలని దుర్బుద్ధితోనే సీఎం కేసీఆర్ ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీ తీసుకొచ్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బీజేపీ పార్టీ ఆఫీస్ ప్రారంభం చేసి, కొల్లాపూర్ ప్రాంతంలో పర్యటించారు. అనంతరం కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ… గత ఏడేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారని, భాగ్యనగరం వరదల్లో కొట్టుకుపోతున్నా పట్టించుకోలేదని విమర్శించారు. బీజేపీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతోందన్న భయంతోనే పుట్ట నుండి తాసుపాము బుసలు కొడుతూ బయటకు వచ్చినట్లుగా ఫామ్‌హౌస్ నుండి ఇప్పుడిప్పుడే బయట తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. గతంలో కేసీఆర్ మాట్లాడితే ఎంతో ఆత్రంగా, ఆసక్తిగా చూసేవారని, ఇప్పుడు సీఎం మాటలు విని నవ్వుకుంటున్నారని అన్నారు. కరోనా టీకా పంపిణీ కేంద్రాల వద్ద ముఖ్యమంత్రి చిత్రపటాలు చూసే చాలామంది టీకా వేసుకోవడానికి రావడం లేదని సెటైర్ వేశారు.

రైతాంగానికి రైతుబంధు ఇస్తున్నట్లు గొప్పగా ప్రచారం చేసుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రుణమాఫీ చేయకపోవడంతో వచ్చిన రైతుబంధు డబ్బులు అంతా బ్యాంకర్లు రుణమాఫీ మిత్తీలకే జమ చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఉద్యోగాల నోటిఫికేషన్ వేయకపోవడంతో ఇప్పటికీ నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఇవి బరాబర్ ముఖ్యమంత్రి చేసిన హత్యలుగానే భావిస్తామని అన్నారు. కేవలం కాంట్రాక్టర్లిచ్చే కమీషన్లకు కక్కుర్తిపడి కృష్ణనీటి వాటాను ఆంధ్రా ప్రభుత్వానికి అమ్ముకుంటున్నారని, తిరిగి ఓట్ల కోసం జల జగడం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. జూలై 5న ముఖ్యమంత్రి కేసీఆర్ నగరి ఎమ్మెల్యే రోజా ఇంటికి వెళ్లి రొయ్యల పులుసు తిన్న వెంటనే కృష్ణ నీటి పంచాయతీ మొదలుపెట్టారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాబోతోందని ఎవరితోనూ పొత్తు పెట్టుకునే దౌర్భాగ్య పరిస్థితి తమకేమీ లేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్‌తో పాటు జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి, బీజేపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ బంగారు శృతి, కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఎల్లేని సుధాకర్ రావు, నాగర్ కర్నూల్ ఇంచార్జ్ దిలీప్ చారి పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story

Most Viewed