బ్రహ్మపుత్ర మీద డ్యాంలు, కరెక్టెడ్ ఎన్ఆర్‌సీ : బీజేపీ అసోం ఎన్నికల మేనిఫెస్టో విడుదల

by  |
jp nadda
X

దిశ, వెబ్‌డెస్క్: ఈశాన్య రాష్ట్రం అసోంలో తిరిగి అధికారాన్ని చేపట్టాలని పట్టుదలతో ఉన్న బీజేపీ ఆ మేరకు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. నిత్యం వరదలతో అతలాకుతలమయ్యే అసోం బాధను తీర్చేందుకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు బీజేపీ జాతీయాధ్యక్షుడు జెపి నడ్డా గువహతిలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అసోం ముఖ్యమంత్రి సర్బనంద సొనొవాల్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జెపి నడ్డా మాట్లాడుతూ.. అసోంలో గడిచిన ఐదేళ్లు తాము సుస్థిర పాలనను అందించామని అన్నారు. బ్రహ్మపుత్ర నదిపై భారీ ఆనకట్టలు నిర్మించి ఆ నీటిని ప్రజల అవసరాల కోసం వినియోగిస్తామని తెలిపారు. తద్వారా వరదల నుంచి ప్రజలను రక్షిస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని అర్హులైన 30 లక్షల పేద కుటుంబాలకు అరుణోదయ పథకం కింద నెలకు రూ. 3 వేల ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు. జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్‌సీ) ప్రక్రియలో తప్పులు దొర్లిన నేపథ్యంలో సక్రమమైన జాబితాను రూపొందిస్తామని హామీ ఇచ్చారు.

మేనిఫెస్టోలోని ప్రధానాంశాలు

ప్రార్థనా మందిరాలకు రూ. 2.5 లక్షల ఆర్థిక సాయం. విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్య. స్వయం సమృద్ధ అసోం కోసం స్థూల, చిన్న పరిశ్రమల స్థాపన. వచ్చే ఏడాది నాటికి ప్రభుత్వరంగంలో లక్ష ఉద్యోగాలు, ప్రైవేట్ రంగంలో ఎనిమిది లక్షల ఉద్యోగాల కల్పన. స్వామి వివేకానంద యూత్ ఎంపవర్‌మెంట్ పథకం కింద వచ్చ ఐదేళ్లలో యువతకు రూ. 2 లక్షల ఆర్థిక సాయం.


Next Story

Most Viewed