బీజేపీ వ్యాపారస్తుల పార్టీ : భట్టి విక్రమార్క

by  |
CLP leader Bhatti Vikramarka
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ వ్యాపారస్తుల పార్టీ అని, రైతులు లేకుండా చేసేందుకే బీజేపీ కొత్త చట్టాలు తీసుకువస్తుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. కిసాన్​ కాంగ్రెస్​ రౌండ్​ టేబుల్​ సమావేశం ఆదివారం గాంధీభవన్​లో నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వక్తలు మాట్లాడారు. అనంతరం పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ… బీజేపీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను వ్యాపారస్తుల చేతిలో పెడుతోందని, వ్యవసాయాన్ని కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించే కుట్రలో భాగమే కొత్త చట్టాలు తెచ్చారని, కేంద్రం, రాష్ట్రాల మధ్య ఫెడరల్ స్ఫూర్తి లేకుండా చేశారని విమర్శించారు. ముందుగా ఈ చట్టాలను వ్యతిరేకించి, రోడ్లెక్కి నిరసనలకు దిగిన టీఆర్​ఎస్​ పార్టీ కేంద్రానికి తలొగ్గిందని, ఫెడరల్ ఫ్రెంట్ కడతానన్న సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి వచ్చి బిల్లులకు మద్దతు పలికారని ఆరోపించారు. వ్యవసాయ చట్టాలు మారలేదు కానీ కేసీఆర్ మారిపోయారని, కేసీఆర్​ స్వార్థం కోసం రైతుల సమస్యలను మోడీ దగ్గర తాకట్టు పెట్టారని భట్టి ధ్వజమెత్తారు. కొనుగోలు కేంద్రాలను ఎత్తివేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కేంద్ర చట్టాలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణలో రైతుల మద్దతు ధరపై శ్వేతపత్రం రూపొందించాలి

ఈ రౌండ్​ టేబుల్​ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. కేంద్రం చట్టాలను ఉపసంహరించుకోవాలని తీర్మానించారు. అదే విధంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్​ రైతులను మోసం చేస్తున్నారని, నియంత్రిత సాగు పేరిట మోసం చేసేందుకు ప్రయత్నిస్తే ఎదురుదెబ్బ తగిలిందని, రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారని, కనీస మద్దతు ధరపై చర్చించేందుకు వెంటనే రాష్ట్ర అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణలో రైతులకు ఇస్తున్న మద్దతు ధరపై శ్వేతపత్రం రూపొందించాలని, దీనికోసం రైతు సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలని తీర్మానంలో పేర్కొన్నారు.


Next Story

Most Viewed