జానారెడ్డి కొంపలో కుంపటి.. బీజేపీ బిగ్ ప్లాన్ ?

by  |
జానారెడ్డి కొంపలో కుంపటి.. బీజేపీ బిగ్ ప్లాన్ ?
X

దిశ, తెలంగాణ బ్యూరో: దుబ్బాక ఉపఎన్నికలో విజయం సాధించి ఫుల్‌ జోష్‌ మీదున్న బీజేపీ.. అదే దూకుడుతో గ్రేటర్‌ ఎలక్షన్ల బరిలో దిగింది. టీఆర్ఎస్‌కు ధీటుగా ప్రచారం చేసి… ఆపార్టీలో అసంతృప్తులకు గాలం వేసి, కీలక నేత స్వామిగౌడ్‌కు కాషాయ కండువా కప్పింది. మరోవైపు విజయశాంతి సైతం బీజేపీలో చేరుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే నాగార్జున‌సాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో అక్కడ జరిగే బైపోల్‌పై బీజేపీ ప్రత్యేక దృష్టిపెట్టింది.

దుబ్బాకలో సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాతను ఓడించి.. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను మొత్తం తమవైపు తిప్పుకున్న బీజేపీ.. ఇప్పుడు నాగార్జున సాగర్‌ నియోజకవర్గంలోనూ వ్యూహాత్మకంగానే పోవాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసం బలమైన అభ్యర్థి కోసం లుక్కేసిన కాషాయ పార్టీ.. హస్తంపార్టీ సీనియర్ నేత జానారెడ్డి కుమారుడు రఘువీర్‌రెడ్డితో చర్చలు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీలో చేరితే ఉపఎన్నికలో సీటు ఇస్తామని రాష్ట్ర, జాతీయ నేతలు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

అయితే 2014లో నోముల నర్సింహయ్యపై గెలిచి, 2018లో ఓడిపోయిన జానారెడ్డి.. కొద్దిరోజులుగా తనయుడు రఘువీర్‌‌రెడ్డి రాజకీయ భవిష్యత్‌ గురించి ఆలోచిస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనే సాగర్‌ నుంచి కాంగ్రెస్ తరపున తనయున్ని పోటీ చేయిస్తారని, జానారెడ్డి మిర్యాలగూడ నుంచి బరిలోకి దిగుతారని ప్రచారం జరిగినా వాస్తవరూపం దాల్చలేదు. అయినా తండ్రీకొడుకులు ఇద్దరూ కాంగ్రెస్‌ పార్టీతో సఖ్యతగానే వ్యవహరిస్తూ కార్యకర్తలతో కలిసిపోతున్నారు. అనుకోకుండా ఇప్పుడు నాగార్జునసాగర్ ఉపఎన్నిక ఖరారు కావడంతో రఘువీర్‌రెడ్డిని బీజేపీలో చేర్చుకొని పోటీ చేయించాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇదే జరిగితే జానారెడ్డి సాగర్‌ అసెంబ్లీ స్థానాన్ని వీడి వచ్చేఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ఒప్పించుకొని మిర్యాలగూడ నుంచి పోటీలో ఉంటారన్న ప్రచారం జరుగుతోంది.

మరోవైపు జరుగుతున్న ప్రచారం మాత్రం జానారెడ్డి ఇంట్లో పంచాయతీ పెట్టడానికే బీజేపీ బిగ్ ప్లాన్ అమలు చేస్తోందని, ఆయన కొడుకును బీజేపీలో చేర్చుకుంటే ఖచ్చితంగా.. ఆయన కాంగ్రెస్ నుంచి బరిలో దిగకుండా ఉండటంతో పాటు బీజేపీకి అనుకూలంగా చక్రం తిప్పుతారన్న ఊహాగానాలు వినపడుతున్నాయి. గతంలో నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో అరవింద్‌‌ గెలుపునకు డీఎస్‌ వ్యూహాత్మకంగా పనిచేసినట్లుగానే ఇప్పుడు జానారెడ్డి చేస్తారన్న అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. అతికొద్దిరోజుల్లో జరగనున్నా ఈ ఎన్నికలో మరి బీజేపీ వేసిన స్కెచ్ అమలవుతుందా లేదా అన్నది చూడాల్సిన అంశం.

Download Disha App Android IOS


Next Story

Most Viewed