అయితే కారు.. లేకపోతే కమలం

by  |
అయితే కారు.. లేకపోతే కమలం
X

టీఆర్ఎస్ పార్టీ 2016 గ్రేటర్ ఎన్నికల్లో 99డివిజన్లలో విజయకేతనం ఎగుర వేసింది. ప్రస్తుత ఎన్నికల్లో పని తీరు అంత బాగా లేని సిట్టింగ్ లకు టిక్కెట్లు దక్కవని పార్టీ అధిష్టానం హెచ్చరించిన నేపథ్యంలో పలువురు తాజా మాజీలు టెన్షన్లో పడ్డారు. దీంతో ఎలాగైనా టిక్కెట్లు దక్కించుకోవాలనుకునే వారు పార్టీ అగ్రనాయకుల చుట్టూ ప్రదక్షిణ చేస్తుండగా టిక్కెట్ దక్కకపోవచ్చనే అనుమానాలు ఉన్న కొంతమంది ప్రత్యామ్నయ పార్టీల వైపు దృష్టి సారిస్తున్నారు.

టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ…?

అధికార టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ అని గ్రేటర్ పరిధిలోని పలువురు నాయకులు విశ్వసిస్తున్నారు. ఇటీవల దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థిపై బీజేపీ అభ్యర్థి విజయం సాధించడంతో గ్రేటర్ ఎన్నికల్లో కూడా బీజేపీపై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో మహా నగరపాలక సంస్థ ఎన్నికల్లో టీఆర్ఎస్ టిక్కెట్ ఆశిం చి దక్కని వారు బీజేపీ వైపు చూస్తున్నారు. ఈ మేరకు టీఆ ర్ఎస్ అగ్రనాయకులతోపాటు బీజేపీ నాయకులతో సైతం టచ్ లో ఉంటున్నారు. తమ అనుచరులతో మంతనాలు సైతం కొనసాగిస్తూ మంచి, చెడులను బేరీజు వేస్తున్నారు.

కార్యాలయం తెరచి…

గోషామహల్ నియోజకవర్గం బేగంబజార్ డివిజన్ కు చెందిన ఓ టీఆర్ఎస్ నాయకుడు గత జీహెచ్ఎంసీ ఎన్నిక ల్లో పార్టీ టిక్కెట్ ఆశించినప్పటికీ దక్కించుకోలేకపోయాడు. దీంతో బేగంబజార్ నుంచి తాను నివాసముండే చైతన్యపురి డివిజన్ పై ద‌ృష్టి సారించాడు. నెల రోజుల క్రితం స్థానికంగా కార్యాలయం సైతం తెరిచాడు. ఇదే డివిజన్ నుంచి ప్రస్తుతం అధికార పార్టీ కార్పొరేటర్ ఉన్నప్పటికీ తాను కూడా ఆశావహున్నేనంటూ టిక్కెట్ దక్కించుకునేందుకు తనవంతు ప్రయ త్నాలు చేశాడు. ఐతే చివరి నిమిషం లో సిట్టింగ్ అభ్యర్థికే టిక్కెట్ వస్తున్నట్లు తెలుసుకుని బీజేపీ వైపు దృష్టి సారిం చాడు. ఎలాగైనా ఈ పర్యాయం ఎన్నికల బరిలోకి దిగి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తహతహలాడుతున్నాడు.

ప్రచారం ఉర్రూతలూగించి…

కార్వాన్ నియోజకవర్గం జియాగూడకు చెందిన మరో టీఆర్ఎస్ పార్టీ నాయకుని పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఈ నాయకుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా పని చేసిన ఓ మాజీ మంత్రికి ప్రధాన అనుచరుడు. గతంలో కార్పొరేటర్ గా పోటీ చేసి ఓడిపోయాడు. తాజా మాజీ కార్పొరేటర్ టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే అయినప్పటికీ అతడిపై ఉన్న అసమ్మతిని తనకు అనుకూలంగా మలుచుకుని ఈ పర్యాయం ఎలాగైనా టిక్కెట్ దక్కించుకుని, పోటీ చేయాలనే తలంపుతో గత కొంతకాలంగా డివిజన్ లో పర్యటిస్తూ ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించడంతోపాటు తానే అభ్యర్థినంటూ ప్రచారం ఉర్రూతలూగించాడు. అయితే ఇక్కడ కూడా తాజా మాజీకే టిక్కెట్ దక్కనున్నట్లు తెలియడంతో ప్రత్నామ్యాయంగా బీజేపీ వైపు చూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ పర్యాయం వీలైతే కారు గుర్తు, లేకపోతే కమలం గుర్తుతో పోటీ చేయాలనే తలంపుతో సదరు నాయకుడు పావులు కదుపుతున్నాడు. ఇలా గ్రేటర్ పరిధిలో చాలా మంది నాయకులు అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ అని నమ్ముతుండడంతో టిక్కట్ల కోసం నాయకులు ఎన్ని పార్టీలు మారుస్తారని ప్రజలు వారిని ఆసక్తిగా గమనిస్తున్నారు.


Next Story

Most Viewed