మూడు బల్బుల బిల్లు.. లక్షా యాభైవేలు

by  |
current-bill b
X

దిశ, ఏపీ బ్యూరో: ఆయనో సాధారణ రైతు కూలీ. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి వారిది. ఇంట్లో మూడు బల్బులు, టీవీ, ఫ్యాన్ తప్ప మరేమీ లేవు. ప్రతీ నెల కరెంట్ బిల్లు రూ.200-300 మధ్య వచ్చేది. అయితే ఈసారి ఏకంగా రూ.1,48,371 వచ్చింది. దీంతో ఆ రైతు కూలీ ఒక్కసారిగా అవాక్కయ్యాడు. దీంతో పలుమార్లు విద్యుత్ శాఖ సిబ్బందిని కలిశాడు. అయితే రూ.56,399 చెల్లించాలని ఆదేశించారు. అంతబిల్లు తాము కట్టలేమని రైతు విలపిస్తున్నాడు. ఇలా గ్రామంలో పలువురు రైతులకు కూడా లక్షల్లో కరెంట్ బిల్లు వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పాల్తూరు గ్రామానికి చెందిన పర్వతప్ప సాధారణ కూలీ. ఆయన ఇంట్లో మూడు బల్బులు, టీవీ, ఫ్యాన్‌ ఉన్నాయి. ప్రతి నెలా కరెంట్‌ బిల్లు రూ.200- 300 మధ్య వచ్చేది. కానీ ఈ మధ్య ఓసారి ఏకంగా రూ.1,48,371 రావడంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు. దీనిపై పలుమార్లు విద్యుత్‌శాఖ సిబ్బంది చుట్టూ తిరిగితే రూ.56,399కి తగ్గించి కట్టాలని చెబుతున్నారు. అయితే తాము అంత బిల్లు చెల్లించలేమని పర్వతప్ప కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అదే గ్రామంలో మరికొందరికి కూడా అధికంగానే కరెంట్‌ బిల్లు వచ్చింది. బండయ్య అనే వ్యక్తికి ఓసారి రూ.78,167, మరోసారి రూ.16,251 వచ్చింది. సాధారణ కూలి పని చేసుకుని జీవించే తమకు ఇంత కరెంట్‌ బిల్లు వస్తే ఎవరికి చెప్పుకోవాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్‌ శాఖ అధికారులు స్పందించి మీటర్‌ బాక్సులో ఏదైనా సమస్య ఉంటే సరిచేయాలని వారు కోరారు.

దీనిపై విద్యుత్‌శాఖ అధికారి శ్రీనివాసులరెడ్డిని వివరణ కోరగా సాంకేతిక సమస్య లేదా సిబ్బంది బిల్లు తీసేటపుడు పొరపాటు చేసి ఉండొచ్చన్నారు. మీటర్లలో సమస్య ఉందా? అనే కోణంలోనూ పరిశీలిస్తున్నామని చెప్పుకొచ్చారు. అవకాశం ఉంటే వారి బిల్లు తగ్గించే ప్రయత్నం చేస్తామని స్పష్టం చేశారు.


Next Story

Most Viewed