బిహార్‌లో రెండో విడత పోలింగ్ ప్రశాంతం

by  |
బిహార్‌లో రెండో విడత పోలింగ్ ప్రశాంతం
X

పాట్నా: బిహార్‌లో రెండో విడత ఎన్నికలు మంగళవారం ప్రశాంతంగా ముగిశాయి. 94 నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. ఉదయం ఏడు గంటలకు మొదలైన పోలింగ్ చాలా చోట్ల ఆరు గంటలకు ముగిసింది. కొన్ని చోట్లలో ఆరు తర్వాతా పోలింగ్ జరిగిందని ఎన్నికల సంఘం తెలిపింది. అత్యధికంగా అభ్యర్థులను బరిలోకి దింపిన ఆర్జేడీకి ఈ విడత కీలకంగా ఉన్నది. మహాగట్‌‌బంధన్ సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ సహా అతని సోదరుడు తేజ ప్రతాప్ యాదవ్‌‌లు పోటీ చేస్తున్న స్థానాలకు ఈ విడతలోనే పోలింగ్ జరిగింది. సీఎం నితీష్ కుమార్, ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ, తేజస్వీ యాదవ్, ఎల్‌జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వన్‌, శత్రుఘన్ సిన్హా సహా పలువురు ప్రముఖులు సంబంధిత పోలింగ్ స్టేషన్‌లలో ఓటేశారు.

తేజస్వీ, తేజ్ ప్రతాప్‌ల నామినేషన్ రద్దు చేయాలి: జేడీయూ

లాలు యాదవ్ కొడుకులు తేజస్వీ యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్‌లు ఎన్నికల అఫిడవిట్లలో ఆస్తి వివరాలను పేర్కొనలేదని, వాటి వివరాలను గోప్యంగానే ఉంచారని రాష్ట్ర మంత్రి నీరజ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ ప్రతినిధులు ఎన్నికల అధికారిని కలిసి మెమోరాండాన్ని సమర్పించారు. వారిపై ఎఫ్ఐఆర్‌‌ నమోదు చేసి నామినేషన్‌లు రద్దు చేయాలని సీఈవో హెచ్ఆర్ శ్రీనివాసాకు మెమోరాండాన్ని అందజేశారు. ఈ విషయాన్ని కమిషన్‌తో చర్చిస్తారని శ్రీనివాసా హామీనిచ్చారు.

భారత్ మాతాకీ జై అని నినదించనివ్వరు: ప్రధాని

మంగళవారమూ ప్రధాని మోడీ, నితీష్ కుమార్, రాహుల్ గాంధీలు హోరాహోరీగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ఆటవిక రాజ్యాన్ని తీసుకురావాలనుకుంటున్నవారు భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్ అని నినదించనివ్వబోరని ప్రధాని మోడీ సహర్సలో పేర్కొన్నారు. వారంతా కలిసి బిహార్‌లను ఓట్లడుగుతున్నారని ఆరోపించారు. అలాంటివారికి తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరమున్నదని అన్నారు. కాగా, ప్రధాని మోడీ, బిహార్ సీఎం నితీష్ కుమార్‌లపై రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. నోట్లరద్దు, జీఎస్టీ, కరోనా కట్టడిలో వైఫల్యం, వలస కార్మికుల సంక్షోభాన్ని ప్రస్తావించారు. లాక్‌డౌన్‌లో వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లిన వలస కార్మికులకు మోడీ, నితీష్‌లు సాయం చేయలేదని అన్నారు.



Next Story

Most Viewed