కోట్ల ఆస్తిని ఏనుగులకు రాసిచ్చిన బిహారీ

by  |
కోట్ల ఆస్తిని ఏనుగులకు రాసిచ్చిన బిహారీ
X

దిశ, వెబ్‌డెస్క్:
పేలుడు పదార్థాలతో నిండిన పనస పండును తిని ఇటీవలే ఓ ఏనుగు మృతి చెందిన ఘటన అందరితో కంటనీరు పెట్టించింది. అయితే ఇక్కడ చెప్పబోయే ఏనుగుల కథ మాత్రం.. అందుకు పూర్తిగా భిన్నమైనది. ఓ యజమాని తన రెండు ఏనుగుల పేరిట ఏకంగా కోట్లాది రూపాయల ఆస్తిని రాసిచ్చి ఔరా అనిపించుకున్నాడు. ఏనుగుల కోసం ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ నడిపిస్తున్న బీహార్‌కు చెందిన అఖ్తర్ ఇమ్రాన్ ఆ విషయాన్ని ఇలా చెప్పుకొచ్చాడు.

‘నేను నా భూమిని.. నా కొడుకుల్లాంటి రెండు ఏనుగులు (మోతి, రాణి)కు రాసిస్తున్నాను. ఆ భూమి విలువ కోట్లలో ఉంటుంది. అయినా సరే జంతువులు మనుషుల్లా కాదు.. అవి చాలా నమ్మకంగా ఉంటాయి. నేను ఎన్నో సంవత్సరాలు ‘ఎలిఫెంట్ కన్జర్వేషన్’ కోసం పనిచేశాను. నా చావు తర్వాత నేను పెంచుకున్న నా ఏనుగులు అనాథలు కాకూడదనే ఉద్దేశంతోనే ఈ పనిచేశానని అక్తర్ వివరించాడు. ఈ సందర్భంగా ఏనుగులతో తనకున్న అనుబంధాన్ని కూడా గుర్తు చేసుకున్నాడు. ఓసారి అక్తర్‌ను కొందరు దుండగులు చంపడానికి వచ్చారట. పిస్తోళ్లతో కాల్చబోతుండగా ఆ ఏనుగులు విపరీతంగా అరిచి తనను అప్రమత్తం చేశాయట. అలా దుండగుల నుంచి తన ప్రాణాలను కాపాడుకోవడంలో ఈ ఏనుగులే సాయం చేసినట్టు అక్తర్ చెప్పుకొచ్చాడు.

ట్రస్ట్‌కు బదిలీ

కొన్ని కారణాల వల్ల పదేళ్లుగా తన భార్య, కొడుకు వేరుగా ఉంటున్నారని అక్తర్ తెలిపాడు. అయితే ప్రస్తుతం ఏనుగులకు తన ఆస్తి రాసివ్వడంతో… కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉండొచ్చనే అనుమానంతో ముందస్తుగా ఫారెస్టు అధికారులకు, జిల్లా ఎస్పీలకు సమాచారం ఇచ్చినట్టు తెలిపాడు. ఆ రెండు ఏనుగులపై ఇప్పటికే బ్యాంకు ఖాతా తెరిచి అందులో రూ.50,000 వరకు ఉంచాడు. ఒకవేళ రాణి, మోతీలు కూడా చనిపోతే.. ఐరావత్ అనే ఆర్గనైజేషన్‌కు ఆ ఆస్తి చెందుతుందని ఆయన వీలునామా రాశాడు. కాగా అక్తర్ చేసిన ఈ పనికి నెటిజన్ల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed