బిహార్‌లో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు!

by  |
బిహార్‌లో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు!
X

పాట్నా: బిహార్‌లో షెడ్యూల్ ప్రకారమే నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకుని అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తుండగా కేవలం జేడీయూ, బీజేపీలు మాత్రమే పోలింగ్‌కు సానుకూలంగా ఉన్నాయి. అయితే, ఎన్నికల నిర్వహణపై తుది నిర్ణయం ఎలక్షన్ కమిషన్ ఇంకా తీసుకోలేదు. ఈసీ ప్రకటన వెలువడనున్న నేపథ్యంలో బిహార్ ఎన్నికల ప్రధానాధికారి ఎలక్టోరల్ ఆఫీసర్లకు శిక్షణ పూర్తి చేశారు. అన్ని 38 జిల్లాలకు ఈవీఎంల తరలింపు పూర్తయింది. కరోనా కేసులు రాష్ట్రంలో భారీగా పెరగకుంటే అసెంబ్లీ ఎన్నికలు రెండు లేదా మూడు దశల్లో నిర్వహించే అవకాశమున్నదని ఈసీవర్గాలు వెల్లడించాయి.

పోలింగ్‌కు ముందు సంసిద్ధతకు సంబంధించి తమకు ప్రత్యేక క్యాలెండర్ ఉంటుందని, దానికి అనుగుణంగానే సన్నాహాలు చేస్తున్నామని బిహార్ ఎన్నికల అదనపు ప్రధాన అధికారి రంజిత్ తెలిపారు. ఎన్నికల నిర్వహణపై పార్టీల అభ్యంతరాలపై ప్రశ్నించగా, వాటిపై ఈసీ నిర్ణయం తీసుకుంటుందని, ఎన్నికల వాయిదాపై తుది నిర్ణయం ఈసీదేనని చెప్పారు. ఇదిలా ఉండగా, జేడీయూ ప్రతినిధి కేసీ త్యాగీ స్పందిస్తూ కరోనా కాలంలోనే శ్రీలంక, ఇజ్రాయెల్, దక్షిణ కొరియాల్లో ఎన్నికలు జరిగాయని, పోలింగ్ విషయంలో రాద్ధాంతమెందుకని ప్రశ్నించారు. ఎన్నికలను వాయిదా వేయాలన్న డిమాండ్‌ను ప్రతిపక్ష నేత తేజస్వీ ప్రసాద్ యాదవ్ పునరుద్ఘాటించారు.

Next Story

Most Viewed