రేవంత్‌ ట్వీట్‌పై జోరుగా చర్చ.. స్పందించిన క్రాంతి కిరణ్

by  |
రేవంత్‌ ట్వీట్‌పై జోరుగా చర్చ..  స్పందించిన క్రాంతి కిరణ్
X

దిశ, ఆందోల్: కాంగ్రెస్‌ ఎంపీ రెవంత్‌రెడ్డి చేసిన ట్వీట్ ఆందోల్ నియోజకవర్గంలోని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి తన కుమారుడి జన్మదినాన్ని పురస్కరించుకొని కర్ణాటకలోని హంపిలో ఏర్పాటు చేసిన విందుపై ఓ ఆంగ్ల దినపత్రికలో ప్రచురితమైన కథనాల్ని తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన రేవంత్‌రెడ్డి.. ‘రస’కందాయంలో హంపి ‘ధూమ్ ధామ్’… కోవర్ట్ ‘క్రాంతి’ కిరణాలతో కకావికలం… యముడు జగదీశ్ రెడ్డి ‘ఘంటా’ కొట్టినట్టేనా…?! అని వ్యాఖ్యానించారు. ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడం, పలు ప్రముఖ టీవీ చానెళ్లలో ప్రసారం కావడం, ఇదే అంశంపై డిబేట్‌ కూడా జరగడం ఆందోల్ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఈ అంశంలో ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌ పేరును కూడా ప్రముఖంగా ప్రస్తావించడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

హంపిలో జరిగిన విందులో ఒక ఎమ్మెల్యే కేసీఆర్‌ కుటుంబంపై పాట పాడడం, ఈటల వ్యవహరం చర్చించడం వంటి విషయాలను విందులో పాల్గొన్న మరొక ఎమ్మెల్యే ప్రగతి భవన్‌కు చేరవేశారని వార్తలు వస్తున్నాయి. అక్కడి విషయాలకు సంబంధించిన వీడియోను ప్రగతి భవన్‌కు చేరవేశారని, అది ఆందోల్ ఎమ్మెల్యేనే చేశారంటూ పలు చానళ్లలో ప్రస్తావనకు రావడంతో ఆందోల్ టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుల్లో చర్చ సాగుతోంది. విందులో కేసీఆర్‌పై అసమ్మతిగా చర్చ జరిగిందా? ఎమ్మెల్యే నిజంగా కోవర్టుగా వ్యవహరించారా? ఎంతవరకు నిజమంటూ నాయకుల్లో పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ మాత్రం పార్టీకి మాత్రమే వెళ్లామని, అక్కడ ఎలాంటి రాజకీయ పరమైన చర్చ జరుగలేదని చెబుతున్నారు. కావాలని కొందరు చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ పలు చానెళ్లకు ఆయన వివరణ ఇచ్చారు. మరి ఈ అంశం చివరకు ఎంతవరకు దారితీస్తుందో చూడాలి.

Next Story

Most Viewed