ఖాకీ సినిమా తరహాలో దోపిడీ దొంగల ఆటకట్టు

by  |
ఖాకీ సినిమా తరహాలో దోపిడీ దొంగల ఆటకట్టు
X

నెల్లూరు జిల్లా పోలీసులు సాహసోపేతంగా అంతర్రాష్ట్ర దోపిడీ, హంతకుల ముఠా ఆటకట్టించి శభాష్ అనిపించుకున్నారు. ఖాకీ సినిమా తరహాలో అత్యంత ఉత్కంఠతో ఆపరేషన్ చేపట్టిన నెల్లూరు పోలీసులు మధ్యప్రదేశ్ కు చెందిన నరరూప హంతకుల ఆట కట్టించారు. ఏడు నెలల పాటు శ్రమించి కేసును ఛేదించడం విశేషం. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే…

నెల్లూరు జిల్లాలోని శ్రీసిటీలోని పారిశ్రామిక సెజ్ నుంచి 2019 ఫిబ్రవరి 12వ తేదీన 4.8 కోట్ల రూపాయల జియోమి, రెడ్‌మీ సెల్ ఫోన్ల లోడ్‌తో లారీ కోల్‌కతాకు వెళ్తుండగా పక్యావ్యూహంతో దగదర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రైవర్‌పై దాడి చేసి రాత్రికి రాత్రే సరకును దొంగిలించిన సంగతి తెలిసిందే. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు దీనిని మధ్యప్రదేశ్‌కు చెందిన కంజరభట్స్ చేసినట్టు గుర్తించారు. ఏడు రాష్ట్రాల్లో గాలింపు చేపట్టి అతి కష్టంమీద గత ఆగస్టు 14న ఆరుగురు ముఠాసభ్యులను అరెస్టు చేసి, వారి వద్దనుంచి 70 లక్షల రూపాయల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రధాన నిందితుడు జీతూ గుప్తాను మాత్రం పోలీసులు అప్పట్లో అరెస్టు చేయలేకపోయారు.

జితేంద్ర గుప్తా అలియాస్ జీతూ గుప్తా.. దేవాస్‌కు చెందిన జీతూ గుప్తా చాక్లెట్ల వ్యాపారం చేస్తూ దేశవ్యాప్తంగా తిరుగుతుంటాడు. చెన్నై నుంచి నెల్లూరు జాతీయ రహదారితో పాటు దోపిడీ ఎలా చేయాలో స్కెచ్ వేసి కంజరభట్స్‌ను జీతూ రంగంలోకి దించాడు. జియోమీ ఫోన్ల లోడును వారు దోచేశారు. ఆగస్టులో నిందితులను అరెస్టు చేసిన తరువాత.. అతనిని అరెస్టు చేసేందుకు పోలీసులు దేవాస్‌కు వెళ్లగా, సెల్ స్విచ్ ఆఫ్ చేసి పరారయ్యాడు. దీంతో నెల రోజులు మకాం వేసి, అతని కళ్ల జోడు దుకాణానికి, ఇంటికి 41ఏ సీఆర్పీసీ నోటీసులు అంటించారు. పోలీసుల అరెస్టు తప్పదని గుర్తించిన జీతూ.. న్యాయవాది సాయంతో పోలీసులకు లొంగిపోయాడు. అతని నుంచి సుమారు 25 లక్షల రూపాయలు రికవరీ చేశారు. ఈ ముఠా నుంచి 1.05 కోట్ల రూపాయలు రికవరీ చేశామని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఇంకా మరికొందర్ని అరెస్టు చేయాలని వారు తెలిపారు.

tags : kanjarbhat, murder, robbery, sricity theft, sricity sez, xiaomi, redmi, mobile phones


Next Story

Most Viewed