ఆర్థిక పాపాల మాఫీకే భూముల అమ్మకం

by  |
Bhatti Vikramarka
X

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం కేసీఆర్​చేసిన విశృంఖ‌ల ఆర్థిక పాపాల‌ను క‌ప్పిపుచ్చుకునేందుకు వేల‌ కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూముల‌ను అమ్మకానికి పెట్టారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. జిల్లాకు వెయ్యి ఎక‌రాల చొప్పున దాదాపు 33 వేల ఎక‌రాల ప్రభుత్వ భూముల‌ను తెగ‌న‌మ్మడానికి సిద్ధమ‌య్యారన్నారు. ఇవి ప్రభుత్వ భూములు, ప్రజల భూములు.. వీటిని ప్రజా అవసరాల కోసమో వినియోగించాలని డిమాండ్​చేశారు.

ప్రజావసరాల కోసం ఉపయోగపడే వాటిని క‌ర‌గ‌దీయ‌డాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉమ్మడి రాష్ట్రంలోనూ ప్రభుత్వ భూముల‌ను కాపాడుకుంటూ, విలువైన ఆస్తుల‌ను ప్రజ‌ల కోసం సృష్టించినట్లు చెప్పారు. తెలంగాణ భవిష్యత్తు అవ‌స‌రాల‌కు ఉప‌యోగప‌డే 33 వేల ఎక‌రాల ప్రభుత్వ భూముల‌ను అమ్ముకుని సొమ్ము చేసుకునేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని రూ.15 వేల కోట్ల మిగుల బ‌డ్జెట్ తో ఏర్పాటు చేసింది. మిగులు బ‌డ్జెట్ సొమ్ము, అప్పులు తెచ్చిన రూ.4 ల‌క్షల కోట్ల డ‌బ్బు.. మొత్తంగా కాళేశ్వరం, మిష‌న్ భ‌గీర‌థ‌ పేరుతో కాజేశారని ఆరోపించారు.

ఇక ఇప్పుడు కేసీఆర్​భూముల‌ మీద ప‌డ్డారన్నారు. ప్రభుత్వ భూముల‌ను కాపాడుకోలేక వాటిని అమ్ముతున్నామ‌ని, అవి నిర‌ర్ధక ఆస్తుల‌ని సిగ్గు లేకుండా కేసీఆర్ మాట్లాడ‌తున్నారని దుయ్యబట్టారు. భూముల‌ను కాపాడ‌లేని వ్యక్తుల‌ను తెలంగాణ ప్రజ‌ల‌ను ఎలా కాపాడతారని ప్రశ్నించారు. అప్పుచేసి పప్పుకూడులా కేసీఆర్ పాలన చేస్తున్నారన్నారు. ఆస్తులు అమ్మి, భూములు అమ్మి.. అప్పులు తెచ్చి.. చివరకు తెలంగాణను కూడా కేసీఆర్ అమ్మేస్తారని జోస్యం చెప్పారు.

ప్రభుత్వపరంగా రెసిడెన్షియల్ స్కూల్స్ కు, ఆసుపత్రులకు, వివిధ ప్రజావసరాలకు భూములు దొరక్క ఇబ్బందులు పడుతుంటే అరకొరగా ఉన్న భూములను నాకేస్తే రాష్ట్రం ఏమవ్వాలని నిలదీశారు. రాష్ట్రాన్ని, మనల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్తు తరాలకు అప్పులను, ఆస్తులు లేని తెలంగాణను ఇచ్చే దుస్థితికి కేసీఆర్ పథక రచన చేస్తున్నారన్నారు. భూముల అమ్మకాలను అడ్డుకోవాలని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు.


Next Story

Most Viewed