తెలంగాణ బడ్జెట్ ఓ అంకెల పుస్తకం: భట్టి విక్రమార్క

by  |
తెలంగాణ బడ్జెట్ ఓ అంకెల పుస్తకం: భట్టి విక్రమార్క
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలపై కేసీఆర్ ప్రభుత్వం అప్పలు భారాన్ని విపరీతంగా పెంచబోతుందన్నారు. బడ్జెట్ అనంతరం ఎమ్మెల్యేలు పొడెం వీరయ్య, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తదితరులతో కలిసి గన్‎పార్క్ వద్ద మీడియాతో మాట్లాడారు. ఈ బడ్జెట్ కేవలం అంకెల పుస్తకంలా ఉంది తప్ప.. దీనివల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని, కరోనా వల్ల ఆదాయం దెబ్బతిన్నదని ఓవైపు చెబుతూనే.. మరోవైపు రూ.2,30,825 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టడం ఎలా సాధ్యమో ముఖ్యమంత్రి చెప్పాలని ప్రశ్నించారు. ఎఫ్ఆర్​బీఎం చట్టాన్ని సవరిస్తున్న సందర్భంలోనే వచ్చే మూడేళ్లలో ఏటా రూ.50వేల కోట్ల అప్పులను ప్రభుత్వం తీసుకొస్తోందని చెప్పినమాట ఇప్పుడు వాస్తవం అవుతోందన్నారు. ఇప్పటికే మూడున్నర లక్షల కోట్ల అప్పు రాష్ట్రంపై ఉందని, ఇప్పుడు తెచ్చే ఒకటిన్నర లక్షల కోట్ల అప్పుతో అది రూ.5లక్షల కోట్లకు చేరుతుందని స్పష్టం చేశారు. ఆర్థికలోటును రూ.45వేల కోట్లకుపైనే చూపించారని, ద్రవ్యలోటును అప్పులతోనే భర్తీచేస్తారన్నారు.

సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ కార్యాచరణేది?

దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, నిరుద్యోగ భృతి, 57 ఏళ్లకే ఇస్తానన్న పింఛన్, సెల్ఫ్ ఎంప్లాయిమెంట్​కు పనికొచ్చే కార్యాచరణ ఏదీ లేదని విమర్శించారు. 2020-21 బడ్జెట్ అంచనాలను చూస్తే రూ.లక్షా 43 వేల కోట్లతో బడ్జెట్‎ను ప్రవేశపెట్టి.. రివైజ్ చేసే సరికి అది కాస్తా రూ.లక్ష 17వేల కోట్లకు తగ్గిందన్నారు. గతేడాది బడ్జెట్ రూ. లక్షా 43 వేల కోట్లకే చేరలేదని, కానీ ఇప్పుడు ఒక్కసారిగా రూ.2.30 లక్షల కోట్లకు చూపించడమంటే ఇంతకంటే హాస్యాస్పదం మరొకటి ఉండదన్నారు. రెవెన్యూ రిసీట్స్ విషయానికి వస్తే గదేడాది రూ.లక్షా 76వేల కోట్లు చూపించారని, గతేడాది రివైజ్డ్ బడ్జెట్ విషయానికొస్తే రూ.లక్షా 17వేల కోట్లకు వచ్చిందని వివరించారు. ఈ ఏడాది ప్రభుత్వం చూపించిన రూ.1.70 లక్షల కోట్ల రెవెన్యూ రిసీట్స్ ఎలా వస్తాయో ప్రభుత్వం చెప్పాలని భట్టి డిమాండ్ చేశారు. నాన్ టాక్స్ రెవెన్యూ విషయానికొస్తే గతేడాది రూ.30వేల కోట్లను ప్రభుత్వం చూపించిందని, అందులో కేవలం రూ.19వేల కోట్లు మాత్రమే వచ్చిందని, ఈ ఏడాది నాన్ ట్యాక్స్ రెవెన్యూ రూ.30వేల కోట్లు ఉందని బడ్జెట్ లో ప్రభుత్వం ఎలా చూపించిందో చెప్పాలని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వాస్తవాలకు దూరంగా ఉందని భట్టి విక్రమార్క విమర్శించారు.

Next Story

Most Viewed