ఇలా లావాదేవీలు జరిపితే ఎలాంటి ఛార్జీలు ఉండవు

by  |
Bharath-Pay-1
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫిన్‌టెక్ కంపెనీల్లో ఒకటైన భారత్‌పే బుధవారం ‘పోస్ట్‌పే ‘ సేవలను ప్రారంభించింది. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా ‘బై నౌ-పే లేటర్’ విభాగంలోకి ప్రవేశించినట్టు కంపెనీ వెల్లడించింది. పోస్ట్‌పే ద్వారా వినియోగదారులు అవసరమైన క్రెడిట్ సౌకర్యాన్ని పొందవచ్చు. ప్లే స్టోర్ నుంచి వినియోగదారులు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొవచ్చని, రూ. 10 లక్షల వరకు వడ్డీ లేని క్రెడిట్ పరిమితిని పొందే అవకాశం ఉందని భారత్‌పే తెలిపింది. అంతేకాకుండా కంపెనీ తన రుణ భాగస్వాముల కోసం మొదటి 12 నెలల్లో పోస్ట్‌పే ద్వారా 300 మిలియన్ డాలర్లు(రూ. 2 వేల కోట్లకు పైగా) రుణాలివ్వాలని లక్ష్యంగా ఉన్నట్టు వివరించింది.

‘బై నౌ-పే లేటర్’ ప్రయోజనాలు పొందాలంటే పోస్ట్‌పే ద్వారా వినియోగదారులు యాప్‌లో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు, బిజినెస్ ఔట్‌లెట్లలో పోస్ట్‌పే క్రెడిట్ ఉపయోగించి కూడా చెల్లింపులు నిర్వహించవచ్చు. లక్షలాది ఆఫ్‌లైన్ వ్యాపారులతో సహా ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో ఈ చెల్లింపులు ఆమోదించబడతాయని భారత్‌పే పేర్కొంది. అదేవిధంగా పోస్ట్‌పే కార్డ్ ద్వారా కూడా చెల్లింపులు జరిపే అవకాశం ఇస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా లావాదేవీలపై క్యాష్‌బ్యాక్ రివార్డులను గెలుచుకునే అవకాశాన్ని భారత్‌పే ఇచ్చింది. ఇవి మొదటి లావాదేవీతోపాటు నిర్ధిష్ట మైలురాయి లావాదేవీలకు ఈ క్యాష్‌బ్యాక్‌లను అందించనున్నట్టు వివరించింది. పోస్ట్‌పే యాప్ లేదా కార్డ్ ద్వారా చేసే చెల్లింపులపై వార్షిక రుసుము/లావాదేవీలకు ఛార్జీలు ఉండవని వెల్లడించింది. ‘బై నౌ-పే లేటర్’ విభాగంలోకి ప్రవేశించడం సంతోషంగా ఉందని భారత్‌పే సహ-వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ అష్నీర్ గ్రోవర్ చెప్పారు.


Next Story

Most Viewed