27న భారత్ బంద్‌ను విజయవంతం చేయండి : అఖిలపక్షం

by  |
27న భారత్ బంద్‌ను విజయవంతం చేయండి : అఖిలపక్షం
X

దిశ, గుండాల : కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 27న తలపెట్టిన భారత్ బంద్‌ను విజయవంతం చేయాలని గురువారం అఖిలపక్ష నేతలు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో భారత్ బంద్‌కు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను తీసుకు వచ్చి.. రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని అన్నారు. కేంద్రంలోని మోడీ సర్కార్, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తూ ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు.

నెలల తరబడి రైతాంగ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్న రైతులను పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలని పిలుపునిచ్చారు. బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు ఎన్నికల వాగ్ధానాలను విస్మరించి నయవంచక పాలనను కొనసాగిస్తున్నాయని ఆరోపించారు.

రైతాంగ సమస్యల పరిష్కారం కోసం జరిగే ఐక్య ఉద్యమాల్లో ప్రజలు, ప్రజాస్వామికవాదులు అధిక సంఖ్యలో పాల్గొని 27న జరిగే భారత్ బంద్ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముక్తి సత్యం, కోరం సీతారాములు, గుపిడి వెంకటేశ్వర్లు, రమేష్, బచ్చలి లక్ష్మీ నర్సింగ్, వజ్జ ఎర్రయ్య, గడ్డం లాలయ్య, షాహిద్, తదితరులు పాల్గొన్నారు.

Next Story