ప్రశాంతగా కొనసాగుతున్న బంద్

by  |
ప్రశాంతగా కొనసాగుతున్న బంద్
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు తెలుగు రాష్ట్రాల్లో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రైతుల ఆందోళనలకు మద్దతుగా టీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం ఇతర రాజకీయ పార్టీల నేతలు ఆందోళన చేపట్టారు. కాగా, రంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్ నుంచి బూరుగురు గ్రామం వరకు మంత్రి కేటీఆర్ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎంపీ కేశవరావు, మంత్రి శ్రీనివాస్ గౌడ్, పార్టీ నేతలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేకమని మంత్రి కేటీఆర్ విమర్శించారు.

ఖ‌మ్మం, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాల్లో భార‌త్‌ బంద్ ప్ర‌శాంతంగా కొన‌సాగుతోంది. బంద్‌కు రాష్ట్ర ప్రభుత్వం మద్దతిచ్చిన నేపథ్యంలో పలు ప్రభుత్వ సంస్థల కార్యకలాపాలు కూడా కొనసాగడం లేదు. జిల్లాలోని దాదాపు 600 బ‌స్సులు డిపోల‌కే పరిమిత‌మ‌య్యాయి. ఖ‌మ్మ‌ం, కొత్త‌గూడెం బ‌స్ స్టేష‌న్లు బ‌స్సులు లేక వెల‌వెల‌బోయాయి.

రోడ్డెక్కని బస్సులు..

భారత్ బంద్‌కు మద్దతుగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో వివిధ రాజకీయ పార్టీల నేతలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. జాతీయ రహదారి 44 పొడవునా ఆయా పార్టీల నేతలు ఆందోళనలు చేయడంతో ఎకడిక్కక్కడ వాహనాలు నిలిచిపోయాయి. మరోవైపు బస్ డిపోల వద్ద బైఠాయించడంతో బస్సులు రోడ్డెక్కలేదు. బంద్‌‌‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొని సంఘీభావం తెలిపారు.

మోటార్ సైకిల్ ర్యాలీ..

వ్యవసాయ వ్యతిరేక విధానాలకు నిరసనగా నిర్వహిస్తున్న భారత్ బంద్‌లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. బంద్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారిపై ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ బైఠాయించారు.

చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు పిలుపునిచ్చిన భారత్‌బంద్‌లో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో జనగామ ఎక్స్ రోడ్డు వద్ద విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై టీఆర్‌ఎస్‌ నేతలు రాస్తారోకో నిర్వహించారు. కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని మంత్రి జగదీశ్ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు ఎంపీ బడుగుల, రాష్ట్ర కార్యదర్శి వై.వీ, టీఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.


Next Story