వీవీఐపీ ఫ్లైట్‌ అనుమతి నిరాకరణ..2గంటలు వేచి చూసిన గవర్నర్

by  |
వీవీఐపీ ఫ్లైట్‌ అనుమతి నిరాకరణ..2గంటలు వేచి చూసిన గవర్నర్
X

ముంబయి: మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీ వీవీఐపీ విమానంలో ప్రయాణించడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో రెండు గంటలపాటు విమానాశ్రయంలోనే నిరీక్షించాల్సి వచ్చింది. తర్వాత కమర్షియల్ ఫ్లైట్‌లో సీట్ బుక్ చేసుకుని ఉత్తరాఖండ్‌కు వెళ్లారు. ఈ ఘటనపై విపక్షంలోని బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించింది. ఇది శివసేన ప్రభుత్వ అహంకారానికి నిదర్శనమని బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ మండిపడ్డారు. సాధారణంగా గవర్నర్ వీవీఐపీ విమాన ప్రయాణానికి రాష్ట్ర ప్రభుత్వం చివరి నిమిషంలో అనుమతులనిస్తుంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీ గురువారం ఉదయం సుమారు 10 గంటలకు నేరుగా ముంబయి ఎయిర్‌పోర్టు చేరుకుని వీవీఐపీ విమానంలో కూర్చున్నారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాకపోవడంతో విషయాన్ని అధికారులు కొశ్యారీకి చేరవేశారు.

సుమారు 15 నిమిషాలపాటు విమానంలో వేచి చూసిన కొశ్యారీ ఫ్లైట్ దిగి బయటికెళ్లారు. దీంతో మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో డెహ్రాడూన్‌కు వెళ్తున్న విమానంలో గవర్నర్ కార్యాలయం సీటును బుక్ చేసింది. ఆ విమానం ద్వారా కొశ్యారీ డెహ్రాడూన్ వెళ్లారు. ఈ విషయంపై ఆరా తీయగా, రాజకీయ ప్రతీకారాలను శివసేన పార్టీ చేయదని ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ఈ ఘటన తన దృష్టికి రాలేదని డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తెలిపారు. కాగా, వ్యక్తిగత అవసరాల కోసం ప్రభుత్వ విమానాలను వాడరాదని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది అభిప్రాయపడ్డారు. స్వయంగా ప్రధాన మంత్రి మోడీ ఈ విషయాన్ని చెబుతుంటారని పేర్కొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed