వానొస్తే రూటు క్లోజే..!

by  |
వానొస్తే రూటు క్లోజే..!
X

దిశ, భద్రాచలం: వానాకాలం భద్రాచలం ఏజెన్సీకి శాపంగా మారింది. అధిక వర్షాలు వచ్చిన గోదావరి వరదలు ముంచెత్తిన రహదారులు అన్ని జల మట్టమై.. ఎక్కడికక్కడే రవాణా స్తంభిస్తుంది. వానకాలం వచ్చింది అంటే ఏజెన్సీ ప్రజల్లో వ ణుకు పుట్టే పరిస్థితి. అత్యవసర సమయాల్లో ఉధృతంగా ప్రవహిస్తున్న వరదలకు వాగులు వంకలు దాటడం తలకు మించిన భారంగా మారుతోంది. ఈ క్రమంలోనే ఇటు ఏజెన్సీ వాసులు అటు పశువులు నది గర్భంలో కలిసి పోయిన సందర్భాలు కోకొల్లలు.. వర్షాల రాకతో గ్రామాల రాకపోకలు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

వానాకాలం భద్రాచలం ఏజన్సీకి శాపం. అధికవర్షాలు వచ్చినా, గోదావరి వరదలు సంభవించినా రోడ్లను ముంచి ఎక్కడికక్కడే రవాణా స్తంభిస్తోంది. ఆ సమయంలో వాగులు, వరదలు దాటించి అత్యవసర ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చడానికి చాలాచోట్ల రోడ్లపైనే పడవలు నడుపుతుంటారు. ఓ వైపు దేశం, మరోవైపు రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందాయని, ప్రగతి పథంలో మనం పయనిస్తున్నామని పాలకులు పదేపదే చెప్పే మాటలకు, మారుమూల ఏజన్సీ ప్రజలు పడుతున్న కష్టాలకు పొంతన కనిపించదు. వరదలు వస్తే రోగులు మెరుగైన వైద్యం కోసం‌ పట్టణాల్లోని దవాఖానాలకు వెళ్లడానికి దారులు కూడా ఉండవు. గత్యంతరం లేని స్థితిలో దేవుడిపై భారంవేసి గ్రామాల్లో అందుబాటుగా ఉన్న ఆర్ఎంపీల వైద్యంతోనే రోగులు సరిపెట్టుకోవాలి. పేషెంట్ బతికితే అదృష్టం. లేదంటే మన్నెంలో పుట్టడమే తమ దురదృష్టం అనుకొంటారు.

భద్రాచలంలో గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక 53 అడుగులకు చేరుకోగానే భద్రాచలం నుంచి చర్ల వైపు వెళ్లే ప్రధాన రహదారిలో పలుచోట్ల వరదనీరు రోడ్లపైకి చేరుతుంది.‌ భద్రాచలం -చర్ల రూటులో వరద ముందుగా దుమ్ముగూడెం మండలం తూరు బాక, గంగోలు గ్రామాల దగ్గర రోడ్డెక్కుతుంది. రెండో ప్రమాద హెచ్చరిక 48 అడుగులపుడు రేగుబల్లి గ్రామం వద్ద వరద రోడ్డుపైకి వస్తుంది. అప్పటికే చర్ల రూట్‌కి రవాణా స్తంభించిపోతుంది. భద్రాచలంలో 3వ ప్రమాద హెచ్చరిక స్థాయి 52 అడుగులకు చేరగానే దుమ్ముగూడెం మండలం బైరాగులపాడు, చర్ల మండలంలో కుదునూరు, దేవరాపల్లి గ్రామాల దగ్గర వరద రోడ్డెక్కి పడవ ప్రయాణమే శరణ్యమవుతుంది. వెంకటాపురం వెళ్ళే మార్గంలో చర్ల మండల శివారు గ్రామం సుబ్బంపేట దగ్గర రో డ్డుని వరద ముంచేస్తుంది. మెయిన్ రోడ్లమీద పడవలు తిరిగే పరిస్థితి రావడం దురదృష్టకరం.

మా హయాంలో అభివృద్ధి చెందిందంటే కాదు మా హయాంలోనే అభివృద్ధి జరుగుతోందని పదేపదే సందర్భాలను బట్టి ఉపన్యాసాలు చెప్పే గత, నేటి పాలకపార్టీల నాయకులారా.. వరదలొస్తే రోడ్లపై పడవలు నడపడమేనా మనం సాధించుకొన్న అభివృద్ధి అని నియోజకవర్గ ప్రజలు నిలదీస్తున్నారు. ఎప్పుడో ఓసారి వచ్చిపోయే వరదలకే ఇలా రోడ్లు నీట మునిగి రవాణా సౌకర్యాలను స్తంభింపజేస్తే భవిష్యత్తులో పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్, సీతారామ ప్రాజెక్టు, సీతమ్మ బ్యారేజ్ లలో వాటర్ స్టోరేజీ సమయాల్లో వర్షాలు, వరదలు సంభవించి వాగులు ఉప్పొంగి, గోదావరి ఉరకలేస్తే అపుడు రోడ్లు ఎలా ఉంటాయో అని భద్రాచల మన్యం ప్రజలు భయపడుతున్నారు. ముందుచూపుతో అధికారులు అంచనాలు వేసి భద్రాచలం – చర్ల రూటులో లోతట్టు ప్రాంతా ల్లో రహదారుల ఎత్తు పెంచకుంటే వానాకాలం అంతా పడవ ప్రయాణమే అయ్యే ప్రమాదం లేకపోలేదు. అదే దుస్థితి వస్తే భద్రాచలం అభివృద్ధి మరో రెండు దశాబ్దాలు వెనక్కిపోయినట్లే అవు తుంది. కనుక పాలకులారా.. ముందుచూపుతో మేల్కొనండి. భద్రాచలం – చర్ల రూటులో ప్రజ ల వానాకాలం రవాణా కష్టాలు లేకుండా చేయండి. అన్నివేళల్లో సాఫీ ప్రయాణానికి చర్య లు చేపట్టండి అని భద్రాచలం నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.



Next Story